కమిషనర్ బదిలీ వెనుక గంటా..? : చంద్రబాబే కల్పించుకున్నారా..!
విశాఖపట్నం : నిజాయితీగా పనిచేసుకుపోయే అధికారులకు.. ప్రభుత్వాలు అడ్డు తగులుతాయా..! విశాఖ జనం నుంచి మాత్రం అవుననే సమాధానమే వినిపిస్తున్నట్టుగా సమాచారం. అవినీతికి తావు లేని నిజాయితీ పాలన అందిస్తామని చెప్పుకునే ప్రభుత్వాధినేతలే.. స్వయంగా కల్పించుకుని మరీ, నిజాయితీ పరులను తప్పిస్తున్నారన్న ఆరోపణలు విశాఖ వర్గాల్లో జోరందుకుంటున్నాయి.
వైజాగ్ కమీషనర్ గా పనిచేసిన అమిత్ గార్గ్ ను విశాఖ నుంచి బదిలీ చేయడం.. ఈ ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. విశాఖలో జరుగుతున్న భూదందాల పట్ల కఠినంగా వ్యవహారించినందుకే అమిత్ గార్గ్ పై బదిలీ వేటు పడిందనే వార్తలు విశాఖ అంతటా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ భూదందాల వెనుక ప్రభుత్వ నేతలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇతర టీడీపీ నేతల హస్తం ఉండడం.. కమీషనర్ అమిత్ గార్గ్ పదే, పదే ఆ దందాలకు అడ్డు తగలడంతోనే ఆయన్ను వైజాగ్ నుంచి సాగనంపారన్న చర్చ జరుగుతోంది.
భూదందాలకు అడ్డు తగలొద్దంటూ స్వయంగా సదరు మంత్రులే కమీషనర్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా..! కమీషనర్ వెనక్కి తగ్గకపోవడంతో విషయం నేరుగా సీఎం చంద్రబాబు చెవిన వేశారని, దీంతో తక్షణ చర్యలకు ఆదేశించిన చంద్రబాబు అమిత్ గార్గేను బదిలీ చేసి సొంత పార్టీ నేతలకు రూట్ క్లియర్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజా-నిజాల స్థాయి ఎంతుందో తెలియదు గానీ టీడీపీ టార్గెట్ చేయడం వల్లే అమిత్ గార్గ్ కు బదిలీ వేటు తప్పలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు.