విషాదం: ఘంటసాల కుమారుడు రత్న కుమార్ కన్నుమూత-ఆ కోరిక తీరకుండానే అకాల మరణం
సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు,డబ్బింగ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్న కుమార్ కన్నుమూశారు. గురువారం(జూన్ 10) తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.ఇటీవల కరోనా బారినపడిన రత్న కుమార్... కొద్దిరోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ... కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు.ఘంటసాల రత్నకుమార్ మరణంతో ఆయన కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
డబ్బింగ్ స్టార్ రత్న కుమార్...
ఘంటసాల రత్న కుమార్ తండ్రిలా సంగీతం వైపు కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరీర్ను మలుచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో నాలుగైదు సినిమాల్లో పాటలు పాడినా ఆ తర్వాత అటువైపు దృష్టి సారించలేదు. డబ్బింగ్లో తిరుగులేని ఆర్టిస్టులగా ఆయన దూసుకెళ్లారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 పైగా సినిమాలకు చెప్పిన రత్న కుమార్... డబ్బింగ్ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్ఖాన్, షారుక్ఖాన్ తదితర హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు.
ఆ కోరిక తీరకుండానే...
ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పిన రికార్డు రత్న కుమార్ పేరిట ఉంది. ఇందుకు గాను అప్పట్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు.
దాదాపు 30 సినిమాలకు ఆయన మాటల రచయితగా వ్యవహరించారు. ఆట ఆరంభం,అంబేడ్కర్,వీరుడొక్కడే తదితర చిత్రాలకు మాటలు అందించారు. నిజానికి దర్శకత్వం చేయాలన్న కోరిక ఆయనలో బలంగా ఉండేది. ఎప్పటికైనా దర్శకుడిగా మారి సినిమా చేస్తానని... అందుకు అవసరమైన స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నానని గతంలో ఆయన పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడా కోరిక తీరకుండానే ఆయన అకాల మరణం చెందారు.
ఘంటసాల సంతానంలో ఆయనొక్కరే సినీ రంగంలో...
ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు ఎనిమిది మంది సంతానం. అందులో నలుగురు కుమార్తెలు(శ్యామల,సుగుణ,శాంతి,మీరా),నలుగురు కుమారులు(విజయకుమార్,రత్న కుమార్,రవి కుమార్,శంకర్ కుమార్) ఉన్నారు. వీరిలో కేవలం రత్న కుమార్ మాత్రమే సినీ రంగంలో ఉన్నారు. రత్న కుమార్తె వీణ తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. గాయనిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అందాల రాక్షసి,తమిళంలో ఉరుం చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. రత్న కుమార్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదంలో నెలకొంది.