తాగుడుకు బానిసైన తండ్రి: బెదిరించేందుకు అలా చేసి అనంతలోకాలకు..
తిరుపతి: తండ్రి మద్యం అలవాటును మానిపించే ప్రయత్నంలో ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మద్యం మానుకోకపోతే చచ్చిపోతానని బెదిరించడమే కాకుండా అతన్ని భయపెట్టడానికి ఎలుకల ముందు తాగింది.
అది వికటించడంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివకు శుక్రవారం అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
ఆమె తల్లిదండ్రులు ఇలా..
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం రజక కాలనీకి చెందిన సరస్వతి, శ్రీనివాస్ దంపతుల కూతురు భార్గవి. ఆమెకు 15 ఏళ్ల వయస్సు. సరస్వతి స్విమ్స్ ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తోంది. తండ్రి ఫొటోగ్రాఫర్.
తాగుడుకు బానిసై అతను ఇలా..
తాగుడుకు బానిసైన శ్రీనివాస్ తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. ఇది చూసిన భార్గవికి మద్యం అంటేనే అసహ్యం పుట్టడం ప్రారంభించింది. మద్యం మానాలని తండ్రి నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. సమస్యపై ఐద్వా అనే మహిళా సంఘం ప్రదర్శిస్తున్న వీధినాటకాల్లో కూడా పాల్గొంటూ వచ్చింది.
తాగుడుపై అసహ్యం పెంచుకుని..
సెలవుల్లో ఖాళీ రోజుల్లో ఆ సంస్థ తరఫున రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రదర్సనలు ఇస్తుండేది. తాగుడు మానేయాలని గత నెల 31వ తేదీన ఆమె మరోసారి తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అందుకు అతను అంగీకరించలేదు.
ఇలా బెదిరించింది
అయితే తాగుడు మానుతావా, ఎలుకల మందు తాగమంటావా అని తండ్రిని బెదిరించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తల్లి ఎలుకల మందు లాక్కుని కింద పడేసింది. అప్పటికే కొంత ఎలుకల మందు భార్గవి నోట్లో పెట్టుకుంది.
మందు వికటించి..
ఎలుకల మందుతో తాను స్పృహ తప్పుతానని, దాంతో భయపడి తండ్రి తాగుడు మానేస్తాడని ఆమె భావించింది. తాను మందు తిన్న విషయాన్ని ఆమె వెంటనే తల్లిదండ్రులకు చెప్పలేదు. దాంతో ఆమె అస్వస్థతకు గురైంది. మూడు రోజుల స్విమ్స్లో చికిత్స అందించినా ఆమె ప్రాణాలు మిగలలేదు.