గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు: పిండాన్ని సంచీలో పెట్టుకుని...
గుంటూరు: ఓ యువకుడు ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేశాడు. దాంతో ఆ అమ్మాయి అత్యంత దయనీయంగా ఆందోళనకు దిగింది. ప్రేమించానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని భ్రమ పెట్టి యువతికి గర్భం చేశాడు. మాయమాటలు చెప్పి ఆమె గర్భంలోని పిండాన్ని హత్య చేశాడు.
ప్రియుడి కిరాతకంతో కంగు తిన్న ఆ యువతి పిండాన్ని సంచిలో పెట్టుకొని రూరల్ పోలీసులను ఆశ్రయించింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.... గుంటూరు జిల్లా బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన కొర్రపాటి రోజాకు ఆరేళ్ళ క్రితం తన మేనమామతో పెళ్లయింది.
పరస్పరం పొసగకపోవడంతో అతనితో విడిపోయి నరసాయపాలెంలో తల్లివద్ద ఉంటోంది. తల్లితో కలిసి రోజు కూలి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుంభా వంశీతో పరిచయమైంది. రోజా తన విషయాలన్నీ అతనికి తెలియజేసింది. వంశీ ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు.
నిరుడు రోజా తల్లి ప్రకాశం జిల్లాలో పోగాకు బ్యారన్లలో పనిచేయటానికి వెళ్ళడంతో వంశీ రోజాను తీసుకెళ్ళి గుంటూరులో ఒక ఇంట్లో ఉంచి, అనుభవిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. తాను గర్భవతిని అయ్యానని వెంటనే పెండ్లి చేసుకోమని వంశీని అడిగింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి, నీవు గర్భం దాల్చావు కాబట్టి కడుపులో నొప్పి రాకుండా, పిండం ఆరోగ్యంగా పెరగడానికి తెచ్చానంటూ కొన్ని మాత్రలను ఆమెకు ఇచ్చాడు. వాటిని ప్రతి మూడు గంటలకు ఒకసారి వాడాలని చెప్పి గర్భం పోయే మాత్రలను ఇచ్చాడు.
వంశీని నమ్మిన రోజా ఆ మాత్రలను మింగటంతో బుధవారం గర్భంపోయి పిండం బయటపడింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రోజా పిండాన్ని సంచిలో పెట్టుకొని రూరల్ పోలీసులను గురువారం ఆశ్రయించింది. వంశీపై ఫిర్యాదు చేయటంతో రూరల్ ఎస్ఐ చల్లాసురేష్ సెక్షన్ 417, 313ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.