వారికి60ఏళ్లు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రక్షాళన గావిస్తా: పాలించడమూ తెలుసంటూ పవన్ క్లారిటీ
పశ్చిమగోదావరి: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఇంత వరకు అధికారం ఇచ్చారు.. ఈసారికి తనకు అవకాశం ఇచ్చి చూడండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో పవన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నరసాపురం, నిడదవోలు, తణుకు ప్రాంతాలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు జనసేనలో చేరారు. వీరికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన సైనికులు ఉంటారని.. జనసేన జెండా ఎగురుతుందన్నారు. సమాజాంలో సరికొత్త సామాజిక రాజకీయ మార్పు తీసుకొస్తానని నమ్మి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.

ఒక్క అవకాశం ఇవ్వండి..
యువతే జనసేన పార్టీకి ఇంధనమని, వారి శక్తికి స్థానిక నాయకుల అనుభవం తోడైతే రాష్ట్రంలో జనసేన బలంగా పాతుకుపోతుందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని 40ఏళ్లు కాంగ్రెస్, 20ఏళ్లు టీడీపీ పాలించాయని, ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని పవన్ కోరారు. రాజకీయాన్ని చాలా బాధ్యతతో చేస్తానని హామీ ఇచ్చారు.

వ్యవస్థను ప్రక్షాళన చేస్తా..
దోపిడీ, లంచగొండితనం లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకొస్తామని పవన్ చెప్పారు. ఓటు విలువ నాటు కోడి పెట్ట విలువలాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి చెప్పాలంటే సినిమాల్లో రెండున్నర గంటలు చాలని, నిజ జీవితంలో మాత్రం 20ఏళ్లు పడుతుందని అందుకే 25ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు.

యువతపై నమ్మకముంది..
మార్పు అనేది ఒక పూటలో రాదని, ఆశయం, సహనం ఉండాలని పవన్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఇదే అభిమానం చూపిస్తున్నారని పవన్ చెప్పారు. యువ శక్తిపై విశ్వాసం ఉందని ఆయన తెలిపారు.

జనసేన ప్రశ్నించడమే కాదు.. పాలిస్తుందని కూడా
జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదని.. పాలించే పార్టీ కూడా అని పవన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పనని.. మీరు ఓట్లు వేసినా.. వేయకపోయినా సమస్యలపై పోరాడతానని పవన్ చెప్పారు. నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మహిళా కార్యకర్తలు, విద్యార్థినులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

మీ కోసమే వచ్చా..
‘మీ అందరి బాగు కోసం మీ కోసం మీ ఇంటి నుంచి ఒకడు వచ్చి పార్టీ పెట్టాడు అంటే అది జనసేన పార్టీయే' అని పవన్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సమస్యలను తీర్చలేను కానీ, పబ్లిక్ పాలసీ రూపంలో అందరికీ భద్రత కలిగిన సమాజాన్ని నిర్మిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

నన్ను ఎవరూ అడగరు కానీ..
‘నా సుఖం నేను చూసుకొని కోట్లు సంపాదించి 60ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రావచ్చు.. నన్ను ఎవరూ అడగరు కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు' అని పవన్ వ్యాఖ్యానించారు. శక్తి ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చిన్న పిల్లలే ఉన్నారని కొందరు అంటున్నారని.. కరక్టే తాను రాజకీయాల్లోకి వచ్చిందే భావితరాల కోసం అని అన్నారు. అంతేగానీ, దోపిడీ చేసే వారికోసం కాదని పవన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications