గోదావరి వరదకల్లోలం-జగన్ కీలక ఆదేశాలు-వరద జిల్లాలకు ప్రత్యేకాధికారులు
ఏపీలో రుతుపవనాల వల్ల కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద పరద ప్రవాహాలతో గోదావరిలో వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో గోదావరి లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గోదావరి జిల్లాల్లో వరదను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జగన్.. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

భయపెడుతున్న గోదావరి వరదలు
గోదావరి నదికి వచ్చిన వరద ప్రవాహం ఈసారి మరింతగా భయపెడుతోంది. ముఖ్యంగా గోదావరికి ఇరువైపులా ఉన్న జిల్లాల్లో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో లంక గ్రామాలన్నీ ముంపుబారిన పడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ధాటికి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కిందికి నీరు వదులుతున్నా ఇంకా ఎగువ ప్రాంతంలో గ్రామాలు భయంభయంగానే గడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది.

జగన్ ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటపొలాలతో పాటు గ్రామాలకు గ్రామాలు ముంపుబారిన పడటంతో క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని సీఎం జగన్ ఇవాళ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందించడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు. ఏరియల్ సర్వే తర్వాత సీఎం జగన్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద జిల్లాలకు ప్రత్యేకాధికారులు
గోదావరి వరదలు - సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియల్సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. సీఎం ఆదేశాల మేరకు మొత్తం ఐదు వరద ప్రభావిత జిల్లాలకు 5గురు సీనియర్ అధికారులను సీఎస్ నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా,
తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్కుమార్, డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మురళీధర్రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్లను నియమించారు.

జగన్ ఆదేశాలివే...
వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశం.
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని సీఎస్ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రేపు కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోందని, లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టమని సీఎం సూచించారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీచేయాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సమాగ్రిని సిద్ధంచేయాలని ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోండి:
ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించమన్నారు. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలన్నారు.
సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలన్నారు. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications