గోదావరికి భారీగా పోటెత్తనున్న వరదనీరు...బిక్కుబిక్కుమంటున్న కోనసీమవాసులు
Recommended Video
తూర్పుగోదావరి:గోదావరి నదికి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కారణంగా శుక్రవారం భారీగా ఈ నదికి వరద పోటెత్తే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అందువల్ల తమ శాఖను అప్రమప్తం చేయడంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కోనసీమ, ఇతర తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం ఆనకట్టకు శుక్రవారం సాయంత్రానికి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో కోనసీమలో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గోదావరిపై ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయానికి 6.2 అడుగుల నీటిమట్టం ఉండగా సముద్రంలోకి 4.52 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరంలో 8.91 మీటర్లు, పేరూరులో 13.26 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.05 మీటర్లు, భద్రాచలంలో 41.9 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రానికి గోదావిరిలో ధవళేశ్వరం ఆనకట్టకు భారీగా వరదనీరు చేరుతుందని, అప్రమప్తంగా ఉండాలంటూ జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రధానంగా కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గోదావరి ఉధృత ప్రవాహంతో పలు చోట్ల రాకపోకలకు అవాంతరం ఏర్పడటంతో లంకగ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో గోదావరికి మరింత వరద నీరు రానుందన్న అధికారుల హెచ్చరికలతో ఏ క్షణంలో ముప్పు ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సంసిద్దులై ఉండాలన్న అధికారుల హెచ్చరికల పట్ల కొందరు సానుకూలత వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోనసీమపై ప్రత్యేక దృష్టి నిలిపిన అధికార యంత్రాంగం ముందస్తు సహాయ చర్యలను ముమ్మరం చేసింది.