ఏపీకి వెళ్తున్నారా ... అన్ లాక్ 2.0 కేంద్ర మార్గదర్శకాలతో నో ఎంట్రీ ... అనుమతి తప్పనిసరి
కేంద్ర హోంశాఖ అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఏపీలో మాత్రం ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అడుగుపెట్టాలన్నాఅనుమతి తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం పాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని తేల్చి చెబుతోంది.
మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబు
కేంద్ర హోం శాఖ అన్ లాక్ 2.0 మార్గదర్శకాలతో ఏపీకి మొదలైన ప్రయాణాలు
కేంద్ర హోం శాఖ అన్ లాక్ 2.0 మార్గదర్శకాల మేరకు చాలామంది ఎలాంటి అనుమతులు లేకుండా ప్రయాణాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ, ఏపీ కర్ణాటక బోర్డర్ వద్ద తీవ్ర ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఇప్పటికే హైదరాబాదులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చాలామంది హైదరాబాద్ ను విడిచిపెట్టి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో సెటిలర్స్ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు కావడంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది.
పాస్ ఉంటేనే అనుమతిస్తామంటున్న ఏపీ అధికారులు
పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని బోర్డర్ లో అధికారులు, అంతరాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పిందని వాహనదారులు తీవ్ర వాగ్వాదాలకు దిగుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేందుకు అనుమతి విషయంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. పక్క రాష్ట్రాల నుండి ఏపీ లోనికి వచ్చే వారికి అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు పాటించవలసిందేనని ఆయన తేల్చి చెప్పారు.
ఏపీలో సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్న డీజీపీ
రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు లోకి వచ్చిన వారికి ఈ పాస్ పరిశీలిస్తామని, అలాగే వారిని క్వారంటైన్ కి తరలిస్తామని,వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి హోమ్ క్వారంటైన్ కు అయినా అంగీకరిస్తామని అంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సరిహద్దుల్లో ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే వారిని అనుమతిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతి
అంతే కాదు లాక్డౌన్ ఆంక్షలు కూడా కొనసాగుతాయని, ఉదయం 7 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అనుమతి ఇస్తామని కూడా చెప్తున్నారు.అత్యవసర సర్వీసులకు మినహాయించి రాత్రిపూట మరే వాహనాలకు అనుమతి లేదని తేల్చి చెబుతున్న పరిస్థితి. ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా చెప్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ పాస్ పొందిన తరువాతే ఏపీకి రావాలని వారంటున్నారు.
కేంద్ర మార్గదర్శకాలతో వెళ్ళి ఇబ్బంది పడుతున్న ప్రజలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2.0 అన్ లాక్ మార్గదర్శకాలతో ఎలాంటి అనుమతి లేకుండా అంతరాష్ట్ర ప్రయాణాలు చెయ్య వచ్చు అని భావించిన చాలామందిని తిరిగి వెనక్కి పంపించేశారు పోలీసులు. అంతే కాదు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత పాసులు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం అలా చెప్తే రాష్ట్రం ఇలా చేస్తుంది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు ఏమైనా .. అమలు నిర్ణయం రాష్ట్రాలదే
అయితే కేంద్రం అన్ లాక్ 2 .0 మార్గదర్శకాలను ఇవ్వడంతోపాటుగా కేంద్రం పేర్కొన్న అంశాలపై నిర్ణయాధికారాన్ని మాత్రం రాష్ట్రాలకు ఇవ్వడం గమనార్హం. అది గమనించకుండా కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర ఏం చెప్పినా కరోనా కట్టడి లో రాష్ట్రాల నిర్ణయం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానిదే అని తేల్చి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏపీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.