కృష్ణాష్టమి ఎప్పుడు? టీటీడీ ఏం చెబుతోంది?
తిరుపతి: ఈ సంవత్సరం అధికమాసం ఏర్పడటం వల్ల పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడింది. పండగ ఘడియలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది కొంత గందరగోళం నెలకొంది. తిథులు, పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండుగ, శుభ ఘడియలు రెండు రోజుల పాటు ఉంటోన్నాయి.
కృష్ణాష్టమి పండగ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 6వ తేదీనా? లేక 7వ తేదీన జరుపుకోవాలా? అనేది తేలట్లేదు. కృష్ణ జన్మాష్టమి భాద్రపద మాసం కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

దృక్ పంచాంగ్ ప్రకారం- జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం, అష్టమి తిథి రాత్రి సమయంలో వస్తాయి. అందువల్ల ఈ సంవత్సరం జన్మాష్టమి రెండు రోజుల పాటు జరుపుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:37 నిమిషాలకు అష్టమి తిథి ప్రారంభమౌతుంది. 7వ తేదీన సాయంత్రం 4:14 గంటలకు ముగుస్తుంది.
రోహిణీ నక్షత్రం సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9:20 నిమిషాలకు ప్రారంభమై, 7వ తేదీ ఉదయం 10:25 నిమిషాలకు ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే 6వ తేదీన జన్మాష్టమి కాగా, 7వ తేదీన ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించాల్సి ఉంటుంది. జన్మాష్టమి నాడు పూజకు అనుకూలమైన సమయం రాత్రి 11:57 గంటలకు ప్రారంభమౌతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సెప్టెంబర్ 7వ తేదీన కృష్ణాష్టమిని జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసింది. ఆ రోజున తిరుమలలో ప్రత్యేక పూజాదికాలను నిర్వహించనుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.

గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవిరాట్కు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. ముఖ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, ఊంజల్సేవ జరుపుతారు. రాత్రి 7 నుంచి 8:15 నిమిషాల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి, భక్తులను కటాక్షిస్తారు.
రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా సెప్టెంబరు 8వ తేదీన ఉట్లోత్సవాన్ని నిర్వహించనుంది టీటీడీ. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల్సేవ ఉంటుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. 8వ తేదీన ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్ధు చేసింది.












Click it and Unblock the Notifications