Good News: కనిగిరిలో అంబానీ కంపెనీ.. వివరాలివే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మొట్టమొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ఏప్రిల్ 2న నిర్వహించనున్నారు, దీనిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అధినేత అనంత్ అంబానీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి గొట్టిపాటితో పాటు ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భూములను సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి కేటాయించి, కౌలు ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కౌలుకు ఇచ్చే భూములకు రూ. 31,000, ప్రభుత్వ భూములకు రూ. 15,000 ఆదాయం లభించేలా ప్రణాళిక రూపొందించారు. రైతులు ప్లాంట్ కోసం గడ్డి పండించి సరఫరా చేస్తే కూడా వారికీ ఆర్థిక లాభం చేకూరుతుందని వివరించారు.

500 సీబీజీ ప్లాంట్ల నిర్మాణ ప్రణాళిక..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రణాళికకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మొదటగా కనిగిరిలో 100 టన్నుల కెపాసిటీ కలిగిన ప్లాంట్ నిర్మించనున్నారు. ఇందుకోసం 5,000 ఎకరాల భూమిని కేటాయించారు. కనిగిరితో పాటు గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కొండెపిలో కూడా ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడతారని వెల్లడించారు.
ఉపాధి అవకాశాలు..
ప్లాంట్ నిర్మాణంతో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. 20 టన్నుల కెపాసిటీ గల సాధారణ సీబీజీ ప్లాంట్ ద్వారా 250 నుండి 500 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంట్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా సీబీజీ ప్లాంట్లను ప్రోత్సహించనున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications