ఇద్దరు చంద్రులకు శుభవార్త! నియోజకవర్గాల పెంపు ఫైల్పై సంతకం చేసిన మోడీ!?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని నరేంద్ర మోడీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం సంబంధిత ఫైల్పై ఆయన సంతకం కూడా చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీల్లోని ఆశావహులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరింత మందికి టిక్కెట్లు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
ఈసారైనా తమకు టిక్కెట్ లభిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్న ఆయా పార్టీల నాయకులు ఇక ఊపిరిపీల్చుకోవచ్చు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని నరేంద్ర మోడీ ఓకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
నియోజక వర్గాల పెంపునకు ఓకే చెప్పిన మోడీ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు ప్రధాని ‘మోడీ' ఓకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ వివిధ కారణాలతో గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల పెంపు పెండింగ్లో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం... ప్రధాని మోడీ మంగళవారం నియోజకవర్గాల పెంపుకు ఓకే చెప్పారు. సంబంధిత ఫైల్పై ఆయన సంతకం కూడా చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫలించిన చంద్రబాబు ఒత్తిడి...?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రధాని మోడీతో సమావేశమైన సందర్భంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని.. ఈ విషయంపై ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నట్లు జరుగుతున్నపరిణామాలు తెలియజేస్తున్నాయి. నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇటీవల బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాని హామీ లభించిన తరువాతే.. ఆయన ఈ విధంగా ప్రకటిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు అంచనా వేశారు. రెండ్రోజుల క్రితం జరిగిన టీడీపీ వర్క్షాప్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల పెంపుపై నాయకులకు నొక్కి చెప్పడం గమనార్హం.
ఇక ఇప్పుడేం జరుగుతుంది?
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు ప్రధాని మోడీ ఆమోదం తరువాత.. వెంటనే సంబంధిత ఫైలు ఎన్నికల కమిషన్కు వెళుతుంది. అదే సమయంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి చట్టసవరణ బిల్లును ప్రవేశపెడతారు. సభ ఆమోదం పొందిన తరువాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల సంఖ్య పెరుగుతుంది. మరో రెండు రోజుల్లో హోంశాఖ ఈ ఫైలును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుంది. ప్రధాని దానిని పరిశీలించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం కోసం పంపుతారు. మంత్రి వర్గం ఆమోదం పొందిన తర్వాత చట్టసభల ముందుకు తెస్తారు.
ఆమోదం లాంఛనమేనా?
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి చట్టసవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడం కూడా లాంఛనమే. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గాల పెంపుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అంగీకారం తెలిపాయి. దీంతో.. ఇప్పుడు ఆ చట్టసవరణకు ఎటువంటి ఆటంకాలు వచ్చే అవకాశం లేదు. పార్లమెంట్లో ఉభయసభల ఆమోదం పొందిన తరువాత .. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225 సీట్లు అవుతాయి. తెలంగాణలో ఉన్న 119 సీట్లు 175కు పెరుగుతాయి. అయితే కాంగ్రెస్ మాత్రం విభజన హామీలు పూర్తిగా అమలు చేస్తేనే నియోజకవర్గాల పెంపునకు మద్దతిస్తామన్న మెలిక పెడుతోంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు వచ్చే అవకాశముందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
అధికార పార్టీలపై తగ్గనున్న ఒత్తిడి...
మొత్తం మీద మూడున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు ప్రధాని మోడీ ఆమోదించడం ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మేలు చేయబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలపై ఒత్తిడి పూర్తిగా తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల కేటాయింపు, సర్థుబాటు ఇక సులువు అవుతుందని వారు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పెంపు ఆశతోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ.. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఇబ్బడిముబ్బడిగా తమ పార్టీల్లో చేర్చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల్లోనూ నాయకులు ఎక్కువై ఓవర్లోడ్ అయ్యింది. ఇక ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే ఇద్దరు చంద్రులకు పెద్ద రిలీఫే అనుకోవాలి.