అమరావతి రైతులకు గుడ్ న్యూస్
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపునకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌలుకు సంబంధించిన బిల్లుల వ్యవహారం సీఎఫ్ఎంఎస్ దగ్గర పెండింగ్లో ఉందని సీఆర్డీఏ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకొని పురోగతిపై వివరాలు సమర్పించాలని సీఆర్డీఏను ఆదేశించింది. ఈనెల 10వ తేదీకి విచారణ వాయిదా పడింది.
రైతులకు కౌలు చెల్లింపునకు సంబంధించి జాప్యం జరుగుతుండటంతో దీన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున గతంలో విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయవాదులు.. రైతులకు ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే కౌలును చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు.

కౌలు డబ్బులు రూ.200 కోట్ల విడుదలకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని, త్వరలోనే వారి ఖాతాల్లో సొమ్ము జమవుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం మే 31వ తేదీలోపు వార్షిక కౌలు జమచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సీఆర్డీయేపై ఉందని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రైతుల వార్షిక కౌలు చెల్లింపునకు సంబంధించిన సొమ్ము రూ.200 కోట్ల విడుదలకు జీవో ఇచ్చినట్లు సీఆర్డీయే వెల్లడించింది. త్వరలోనే వారి ఖాతాల్లో కౌలు సొమ్ము జమకానుందని కోర్టు దృష్టికి తెచ్చింది.












Click it and Unblock the Notifications