అద్దంకిలో ఉద్రిక్తత: గొట్టిపాటి ప్లెక్సీలు చించివేత, కరణం వర్గీయుల పనేనా?
అమరావతి: ప్రకాశం జిల్లా అద్దంకిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గడచిన ఎన్నికల్లో అద్దంకి నియోజగవర్గం నుంచి వైసీపీ పార్టీ తరుపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఈనెల 27వ తేదీన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలోకి గొట్టిపాటి చేరికను మొదట నుంచి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్ చివరి వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.
అయితే ముఖ్యమంత్రి స్వయంగా కరణం బలరాంను విజయవాడకు పిలిపించుకుని సర్ది చెప్పడంతో చంద్రబాబు సమక్షంలో గొట్టిపాటి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రకాశంలో జిల్లాలోని అద్దంకి ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఎంతోకాలం నుంచి గొట్టిపాటి, కరణం వర్గీయులు ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో గొట్టిపాటి టీడీపీలోకి చేరినా వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గొట్టిపాటి టీడీపీలోకి చేరిన సందర్భంగా అద్దంకి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని నిందితులు కొందరు చించివేసారు.
దీంతో ఈరోజు ఉదయం గొట్టిపాటి ఫ్లెక్సీలు చిరిగిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకు ఈ ఘటనకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న గొట్టిపాటి శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్లెక్సీల చించివేతను ఆకతాయిల పనిగా అభివర్ణించారు.
అయితే ఆయన అనుచరులు మాత్రం కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. గొట్టిపాటి రవికుమార్ రాకను వ్యతిరేకించిన కరణం వర్గీయులే ఈ ప్లెక్సీలను చించివేశారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం కూడా గొట్టిపాటి టీడీపీలోకి చేరడానికి ముందు రోజు కూడా అద్దంకిలో గొట్టిపాటి ప్లెక్సీలను చించివేశారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వార్తను బయటకు రాకుండా ప్లెక్సీలను అతికించారు. అయితే గొట్టిపాటి ప్లెక్సీల చించివేతతో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ప్లెక్సీల చించివేతను సీరియస్గా తీసుకున్న పోలీసులు దీని వెనుక కరణం వర్గీయులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు.