గుక్కపెట్టి ఏడుస్తున్న విజయ్ ఫ్యాన్స్.. షాకిచ్చిన సర్వేలు
తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త చరిత్ర లిఖించాలని ఆశించిన 'దళపతి' విజయ్.. రాజకీయ రంగప్రవేశం చేసి ఆపై జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కోట్లాది మంది అభిమానులు తమ నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని కలలు కంటున్న తరుణంలో, వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దళపతి ఫ్యాన్ బేస్ బలానికి, ఈ అంచనాలకు మధ్య పొంతన కుదరకపోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఆవేదన మిన్నంటుతోంది.
తమిళగ వెట్రి కజగమ్ (టీవీకే) స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్పై ఆ రాష్ట్ర యువత, పాత తరం అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అభిమానుల హృదయాలను బద్దలు కొడుతున్నాయి. విజయ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవచ్చని, టీవీకే బలం కేవలం డబుల్ డిజిట్కే పరిమితం కావచ్చని మెజారిటీ సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ వార్త వినగానే తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు షాక్కు గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్)లో తమ నాయకుడి కోసం ఏడుస్తూ పోస్ట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను కన్నీటిమయం చేస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి:
వివిధ సంస్థల విశ్లేషణల ప్రకారం తవెక గెలుచుకునే స్థానాల అంచనాలు ఇక్కడ చూడవచ్చు:
- అగ్ని న్యూస్ సర్వీసెస్: 1 స్థానం
- మిన్నంబాళం: 5 స్థానాలు
- మ్యాట్రైజ్: 10-12 స్థానాలు
- చాణక్య స్ట్రాటజీస్: 13-18 స్థానాలు
- పీపుల్స్ పల్స్: 18-24 స్థానాలు
- పి-మార్క్: 16-26 స్థానాలు
- ఆక్సిస్ మై ఇండియా: 90-110 స్థానాలు (ఒక్క ఈ సంస్థ మాత్రమే భారీగా అంచనా వేసింది)
"ఇది ఆరంభం మాత్రమే.. పతనం కాదు!"
"మేము దళపతిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడ్డాం, కానీ ఈ అంచనాలు మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి" అని పలువురు అభిమానులు శాడ్ మ్యూజిక్ తో వీడియోలు చేస్తున్నారు. అయితే, ఎంతమంది ఎన్ని అంచనాలు వేసినా, తమ నాయకుడికి ప్రజల మద్దతు తగ్గదని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. "20 సీట్లు అనేది ప్రయాణం ఆరంభం మాత్రమే, మా దళపతి వెనక్కి తగ్గడు" అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు.
మే 4న అసలు సిసలు ఫలితం!
ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, యువత ఓటర్ల ఆధారంగా రూపొందుతాయి కాబట్టి, గ్రామీణ మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉందనేది మే 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది. గతంలో ఎన్నో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియా కన్నీటిమయంగా కనిపిస్తున్నా, అసలైన 'విజయ్' ప్రభంజనం తమిళనాడులో ఉందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications