ఇద్దరూ ఇద్దరే: టి, ఏపి సిఎంలపై గవర్నర్ ప్రశంసలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్రావు ఇద్దరూ సమర్థులేనని, తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒక విజన్తో పనిచేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారివారి విజన్తో ముందుకెళ్తున్నారని అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి వస్తున్న ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని మీడియా గవర్నర్ దృష్టికి తీసుకురాగా.. అలాంటిదేమిలేదని అన్నారు.
సంచలన వార్తలకోసం మీడియా ఉత్సాహపడుతోందని అయితే మిమ్మల్ని నిరాశపరుస్తున్నానని నవ్వుతూ మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ 16వేల కోట్లు లోటు బడ్జెట్లోవుంది కదా, కేంద్రం నుంచి నిధులేమైనా తెప్పిస్తారా అన్న ప్రశ్నకు అదంతా ఆ భగవంతుని చేతిలో ఉందని తన చేతిలో ఏమిలేదని సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా 2015 నూతన సంవత్సరానికిగాను టిటిడి ముద్రించిన క్యాలెండర్ డైరీని గవర్నర్ ఆవిష్కరించారు. కాగా అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తునిగా అమ్మవారి పంచమీతీర్థం కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు.