ఏమైంది: జగన్ 'శ్రీవారి' ఘటనపై గవర్నర్, కిరణ్కు షాక్
హైదరాబాద్: మూడు రోజుల క్రితం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీవారి ఆలయంలో నిబంధనల అతిక్రమణ జరిగిందా? లేదా? అనే అంశాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులను వివరణ కోరినట్లుగా సమాచారం. అధికారులు సమాచారం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.
ఆదివారం తిరుపతిలో జనభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు నిబంధనలు అతిక్రమించినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు పాదరక్షలతో వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది గుర్తించి పాదరక్షలతో రాకూడదని చెప్పడంతో ఆయన అక్కడే ఆ పాదరక్షలు విడిచిపెట్టి దర్శనానికి వెళ్లారు.
అంతకన్నా ముఖ్యంగా అన్యమతస్తులు స్వామి వారిని దర్శించుకొనే ముందు వెంకన్నపై తమకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందని, హిందూ సాంప్రదాయం పట్ల విశ్వాసం ఉందని తెలియజేస్తూ టిటిడి సిద్ధం చేసిన రిజిస్టర్లో నమోదు చేసి సంతకం చేయాల్సి ఉంది. అయితే అలాకాకుండా జగన్ దర్శనానికి వెళ్లడంతో వివాదం చెలరేగింది.
గవర్నర్ నరసింహన్ నరసింహావతారం ఎత్తారు. రాష్ట్రపతి పాలనలోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలను అన్నిటినీ సమీక్షిస్తున్నారు. తేడా వచ్చిన వాటిని ఒక్కొక్కటిగా తిప్పికొడుతున్నారు. పనిలో పనిగా అధికారులను హడలెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చివరి రెండు నెలల్లో కిరణ్ చేసిన రాజకీయ నియామకాలు మొదలుకుని అధికార పోస్టింగుల వరకూ అన్ని నిర్ణయాలను తిరగదోడుతున్నారు.
కిరణ్ పదవి నుంచి దిగిపోవటానికి చివర్లో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (విజిటిఎం) ఉడా డైరెక్టర్లుగా నలుగురిని నియమించారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పాలకవర్గ సభ్యులుగా సోమవారమే వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే, కిరణ్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపు చేస్తున్నట్లు గవర్నర్ మంగళవారం ప్రకటించారు. దీంతో, ఒక్కరోజు కూడా కాకుండానే ఆ నలుగురూ మాజీలైపోయారు.
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో సంతకాలు చేసిన ఫైళ్లను, నిర్ణయాలను సమీక్షించే పనిని గవర్నర్ నరసింహన్ వేగవంతం చేశారు. కిరణ్ చివరి నిమిషంలో చేసిన బదిలీలను ప్రభుత్వం రద్దు చేయడం, మార్పు చేయడం గమనార్హం. నిన్నటి వరకు కిరణ్ సంతకాలు చేసిన చివరి నెల రోజుల ఫైళ్లను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన గవర్నర్, ఇప్పుడు రెండు నెలల ఫైళ్లు పంపాలని తాజా ఆదేశాలు జారీ చేశారు.
చివరి రెండు నెలల కాలంలో కిరణ్ సంతకాలు చేసిన ఫైళ్లు, తీసుకున్న నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీవంటి అన్ని వివరాలు అందించాలని సిఎస్ను ఆదేశించారు. రెండు రోజుల క్రితమే కిరణ్ నిర్ణయాల ఫైళ్లు కావాలని గవర్నర్ కోరినప్పటికీ అందులో ఎప్పటి నుంచి కావాలన్న వివరాలు లేకపోగా, సోమవారం రాజ్భవన్ నుంచి వచ్చిన లేఖలో నెల రోజుల ఫైళ్లు, ఇతర వివరాలు కావాలని కోరారు. అయితే నెల రోజులవి కాదని, రెండు నెలల వివరాలు కావాలని మంగళవారం కోరారు.