మిడతల దండు ఎంత పని చేసిందంటే .. ఏకంగా బస్ స్టాండ్ పైనే దాడి చేసింది
సహజంగా మనుషులపైన కుక్కల దాడి చేయడం చూసి ఉంటారు. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగులు ఊర్లమీద, పంట పొలాల మీద దాడి చేయడం కూడా చూసి ఉంటారు. కానీ మిడతల దండు దాడి చేయడం మీరు ఎప్పుడైనా చూసారా.. ఒకవేళ చూడకపోతే తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ కి వెళితే మిడతల దాడి ఎలా ఉంటుందో అర్థమవుతుంది.
తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ లో ఒక్కసారిగా వేల సంఖ్యలో మిడతలు దాడి చేశాయి. ఎవరికీ ఎలాంటి హాని కలిగించకున్నా , ప్రయాణికులకు మాత్రం అసౌకర్యం కలిగించాయి. బస్ స్టాండ్ ఆవరణ మొత్తం కొన్ని వేల సంఖ్యలో మిడతల దాడితో బస్ స్టాండ్ లో ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తీరా చూస్తే బస్ స్టాండ్ అంతా కాసేపట్లోనే మిడతలతో నిండిపోయింది. ఇక అక్కడ బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు, బస్టాండ్ నిండా ఉన్న మిడతలను చూసి అక్కడ నిరీక్షించేందుకు సైతం ఇబ్బంది పడ్డారు.
ఆర్టీసీ అధికారులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఫినాయిల్ స్ప్రే చేసి కొంతమేర మిడతలు పోయేలా చేశారు. అయినప్పటికీ ఇంకా వేలాదిగా మిడతలు బస్టాండ్ లో ఉన్నాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా అడవి నుండి మిడతల దండు బస్ స్టాండ్ మీద దాడి చేసిందని అక్కడి వారు చెబుతున్నారు. కనీసం బస్టాండ్ లో ఎక్కడా కూర్చునేందుకు కూడా అవకాశం లేనంతగా మిడతలు వచ్చి చేరాయి.
మిడత లే కదా ఏం చేస్తాయి అనుకుంటే వాటివల్ల బస్టాండ్ లో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఎక్కడపడితే అక్కడ వాలుతూ, శబ్దం చేస్తూ చికాకు కలిగేలా చేశాయి. ఇక వాటి బాధ భరించలేక ఈ మిడతల బారి నుండి కాపాడండి మహాప్రభో అంటున్నారు అక్కడ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు.