సభకు భద్రత కల్పించలేమన్న ఎస్పీ! పవన్ కళ్యాణ్ హామీ, హక్కుందని టిడిపి
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం 4 గంటలకు తలపెట్టిన బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి లభించింది.
స్థానిక ఇందిరా మైదానంలో సభ జరగనుంది. సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మి సూచించారు. పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు ఎస్పీ తెలిపారు. తమ పార్టీ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్ హామీ ఇవ్వడంతో పోలీసులు బహిరంగ సభకు అనుమతిచ్చారు.
పవన్ కళ్యాణ్ రేపటి సభలో ఏం మాట్లాడుతారనే చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాలపై మాట్లాడతారా? లేదంటే హద్దులు దాటిపోయిన అభిమానంపై గొంతు విప్పుతారా? అనే చర్చ సాగుతోంది.

కర్ణాటకలోని కోలార్లో టాలీవుడ్ యంగ్ హీరో ఫ్యాన్స్ దాడిలో చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి వచ్చిన ఆయన ప్రస్తుతం తిరుమల కొండపై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ సభపై మంత్రి పత్తిపాటి స్పందన
పవన్ కళ్యాణ్ సభ పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇతర టిడిపి నేతలు స్పందిస్తున్నారు. పత్తిపాటి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా గురించి అడిగే హక్కు ఎవరికైనా ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా పైన పవన్ నిర్వహించే సభకు వెళ్లాలా వద్దా అనే విషయమై చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications