తాత్కాలిక సచివాలయానికి 'గ్రీన్' సిగ్నల్: టిడిపిలోకి చేరికలు అవసరమన్న బాబు
విజయవాడ: ఏపీకి తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. 45 ఎకరాల్లో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ సముదాయంలో 58,665 వేల చ. మీ. ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా అనుమతి పత్రాలు డిఆర్డీఏకు అందాయి. మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చిస్తున్నారు.
ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలి
రాష్ట్రంలో ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. క్యూబిక్ మీటర్ రూ.500 మించి ఎక్కడా విక్రయించరాదని ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు నర్సింగ్ హోంల ఏర్పాటుకు కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు.
పార్టీలోకి చేరికలు అవసరం: చంద్రబాబు
ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి చేరికలు అవసరమని ఆయన సూచిస్తున్నారు. పార్టీ పైన ఆసక్తితో చేరుతానంటున్న వారిని వద్దని చెప్పవద్దని నేతలకు ఆయన హితవు పలికారు. పార్టీ ప్రయోజనాల కోసం, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి న్యాయం చేస్తానని చెప్పారు.