అదే అలసత్వం!: నారాయణరెడ్డిని పట్టించుకోలేదు, ఇప్పుడు మరో వైసీపీ నేత..
ఇచ్చిన గడువుకు 25రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నా.. పోలీసులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
అనంతపురం: ఏపీ పోలీసులు ప్రతిపక్ష నేతల పట్ల ఉద్దేశపూర్వకంగానే అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని పత్తికొండ వైసీపీ ఇన్చార్జీ నారాయణరెడ్డి ఎన్నిసార్లు కోరినా స్పందించని పోలీసులు.. ఇప్పుడు మరో వైసీపీ నేత విషయంలోను అలాగే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
సమయానికి గన్ లేకపోవడం వల్లే.. ప్రత్యర్థులు నారాయణరెడ్డిని సునాయసంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఒకరి మరణం తర్వాత కూడా పోలీసుల్లో పెద్దగా మార్పు రాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. గుంతకల్లు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి తుపాకీ లైసెన్సును రెన్యువల్ చేయడంలో పోలీసులు జాప్యం ప్రదర్శిస్తున్నారనేది వారి ఆరోపణ.
ఇచ్చిన గడువుకు 25రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నా.. పోలీసులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే విషయంపై వెంకట్రామిరెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసులు తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి తుపాకీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నారు.
కాగా, నారాయణరెడ్డి రివాల్వర్ రెన్యువల్ విషయంలోను పోలీసులు చేసిన జాప్యం ఆయన ప్రాణాలను హరించిన సంగతి తెలిసిందే. ఆయన వద్ద ఆయుధం లేని సమయం చూసి ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విరుచుకుపడి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే మిగతా వైసీపీ నేతలు సైతం అప్రమత్తమయ్యారు.