ఎంపీ గల్లా జయదేవ్కు స్వల్ప గాయాలు: మట్టిగుట్టను ఢీకొట్టిన కారు
అమరావతి: అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వరుసగా రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే గుంటూరులో ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో ఆయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
తాజాగా ఆయన మరోసారి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు వెళుతున్న సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే... ఐటీసీ సంస్థ రూ.150 కోట్లతో గుంటూరులో నిర్మించనున్న 'మై ఫార్చూన్' పైవ్ స్టార్ హోటల్కు శుక్రవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది.
ఈ క్రమంలో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గల్లా జయదేవ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరుకు బయల్దేరారు. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి.
దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడకు తరలించి అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గుంటూరులో ఐటీసీ నిర్మిస్తున్న పైవ్ స్టార్ హోటల్ శంకుస్థాపన కార్యక్రామానికి ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్బాబు, ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే గుంటూరు పట్టణంలో ఏర్పాటవుతున్న తొలి ఐదు నక్షత్రాల హోటల్ ఇదే కావడం విశేషం. 1.44 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్థులు, 150 గదులతో మూడేళ్లలో హోటల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. హోటల్ నిర్మాణం పూర్తైన తర్వాత ఐటీసీ హెడ్ ఆఫీస్తో పాటు సిబ్బంది మొత్తం గుంటూరుకు తరలించనున్నట్లు ఐటీసీ ప్రతినిధులు తెలిపారు.