గిన్నిస్బుక్లోకి ఎక్కిన గుంటూరు విద్యార్థిని...నృత్య రీతుల్లో విశేష ప్రతిభ
గుంటూరు: సంప్రదాయక నృత్య రీతుల్లో విశేష ప్రతిభ కనబర్చడం ద్వారా ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటుసంపాదించింది గుంటూరు నగరానికి చెందిన బి.సాయికీర్తన అనే విద్యార్థిని. సాంప్రదాయ నృత్యంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించిన సాయికీర్తన ప్రతిభను గుర్తించి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అందులో స్థానం కల్పించినట్లు తెలిసింది.
స్థానిక లక్ష్మీపురం మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం స్కూల్లో 9 వ తరగతి చదువుతున్నబి.సాయికీర్తన గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సాధించినట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ కె.వి.సెబాస్టియన్ వెల్లడించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సాయికీర్తనను విద్యాసంస్థ తరుపున ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె.వి.సెబాస్టియన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నాగపూర్లో జరిగిన జాతీయ స్థాయి సంప్రదాయక నృత్యపోటీల్లో బి.సాయికీర్తన ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా సంప్రదాయక నృత్యంలో విశేష నైపుణ్యం ప్రదర్శిస్తున్న సాయికీర్తన విజయాలను గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించి పురస్కారం అందజేసినట్లు వివరించారు. తమ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారిలో దాగి ఉన్న కళానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామని ఈసందర్భంగా ఆయన చెప్పారు.