జగన్కు షాక్: దెబ్బతో టిడిపిలోకి గుర్నాథ్? పరిటాల-జెసిలతో సంబంధాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కీలక నేత గుర్నాథ్ రెడ్డి అధికార టిడిపి వైపు చూస్తున్నారా? వైసిపిలో అంతర్యుద్ధం కనిపిస్తోందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
Recommended Video
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కీలక నేత గుర్నాథ్ రెడ్డి అధికార టిడిపి వైపు చూస్తున్నారా? వైసిపిలో అంతర్యుద్ధం కనిపిస్తోందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
వైసిపి ఉండదు, జగన్ చాలాసార్లు రెచ్చగొట్టారు: చిల్లర తీసుకోకుండా వెళ్లిన చంద్రబాబు
అనంతపురం వైసిపిలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవి చూసింది. మరోవైపు, అంతర్గత విభేదాలు టిడిపి వైపు చూసేందుకు కారణంగా కనిపిస్తోంది.
అనుచరులతో సమావేశాలు
ముఖ్యంగా అనంతపురం నగరానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనిపై స్థానికంగా కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో అంతర్గత సమావేశాలు నిర్వహించి తన నిర్ణయం తెలిపారని సమాచారం.
వైసిపికి కీలక నేత, టిడిపి నేతలతో సంబంధాలు
అనంతపురం నియోజకవర్గంలో వైసిపికి ప్రధాన నాయకుడిగా ఉంటున్న గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరితే వారి ఆయనకు సంబంధించిన వారంతా పార్టీ మారే అవకాశాలుంటాయని అంటున్నారు. వైసిపిలో కొనసాగుతున్నా ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొందరు టిడిపి నేతలతో ఆయన మంచి సంబంధాలు నెరపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
పరిటాల నుంచి జేసీ వరకు..
దివంగత పరిటాల రవీంద్ర హయాం నుంచి ఆయన కుటుంబంతో గుర్నాథ్ రెడ్డికి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని అంటారు. ఇప్పుడు మంత్రి పరిటాల సునీతతోనూ సఖ్యతతో ఉంటారని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతోనూ గుర్నాథ్ రెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. దీంతో వైసిపిలో ఉండటం కంటే టిడిపిలో చేరడమే మేలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
వైయస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు
మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్న గుర్నాథ్ రెడ్డి కుటుంబం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అనంతపురం నుంచి నారాయణరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు అనారోగ్యం కారణంగా సోదరుడు గుర్నాథ్ రెడ్డి 2009లో పోటీ చేసి గెలిచారు. వైయస్ మృతి అనంతరం జగన్ వెంట నడిచారు.
అప్పుడు టిడిపి అభ్యర్థిపై గెలుపు
2012లో కాంగ్రెస్ నుంచి వైసిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా రాజీనామా ప్రకటించి తిరిగి ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో అనంతపురం నుంచి పోటీ చేసిన గుర్నాథ్ రెడ్డి టిడిపి అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన వైసిపి అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి గుర్నాథ్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటున్నారు.
జగన్పై అసంతృప్తి
కాగా, ఇటీవల నదీం అహ్మద్ను సమన్వయకర్తగా నియమించడంతో గుర్నాథ్ రెడ్డి మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. నదీం ఆధ్వర్యంలో గత వారం నిర్వహించిన పార్టీ సమావేశానికి కూడా ఆయన వెళ్లలేదు. దీంతో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో గుర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వరని ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారని, టిడిపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. పొమ్మనలేక గుర్నాథ్ రెడ్డికి పొగ బెడుతున్నారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.