జివిఎల్...ఆ రూ. 28 కోట్లు ఎక్కడవి?:వర్ల రామయ్య;జగన్...కేసులు వేయించింది నువ్వు కాదా?:దేవినేని ఉమ
విజయవాడ: సీఎంఎస్లో ఉద్యోగం మానేసినప్పుడు చిల్లిగవ్వ లేదన్న జీవీఎల్కు ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో చూపిన రూ.28 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.
మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపి ఎంపి జీవీఎల్ అబద్ధాల కోరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు డీఆర్ఎస్ కంపెనీ ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపించలేదని వర్ల రామయ్య నిలదీశారు. జివిఎల్ అఫిడవిట్లో చూపిన ఆస్తులన్నీ అవినీతి సంపాదనేనని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
అసలు జివిఎల్ కు రాజ్యసభ ఎంపి పదవి ఎలా వచ్చిందో త్వరలో బయటపెడతామని వర్ల రామయ్య చెప్పారు. అసలు నీకు పీడీ అకౌంట్ అంటే ఏంటో తెలుసా?...అని బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావును వర్ల రామయ్య ప్రశ్నించారు.
మరోవైపు వైసిపి అధినేత జగన్ పై మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం విజయవాడలో మంత్రి ఉమ మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాలకు సమాచారమిచ్చి కేసులు వేయించింది నీవు కాదా అని జగన్ ను మంత్రి ఉమ ఘాటుగా ప్రశ్నించారు. జగన్ మెట్ట ప్రాంతాలకు నీరు తరలిస్తుంటే విషం చిమ్ముతున్నారన్నారు. బలవంతంగా టెండర్లు క్లోజ్ చేయించింది ఎవరో అందరికీ తెలుసని జగన్పై దేవినేని ఉమా మండిపడ్డారు.
పోలవరం పనులు 57.14 శాతం పూర్తయ్యాయని, గోదావరిలో లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉందని, డౌన్సైడ్ జెట్ గ్రౌటింగ్ పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కుడి కాలువ ద్వారా 6 లక్షల ఎకరాలకు గోదావరి నీరందించామని మంత్రి ఉమ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో డ్యాం సైట్లో 1.4 శాతం మాత్రమే పనులు చేశారన్నారు. మేము 43 శాతం పనులు పూర్తి చేశాం...ఈ విషయం కేవీకి గుర్తులేదా?...అని మంత్రి ఉమ ఎద్దేవా చేశారు.