హుధుద్ తుఫాను: బస్సే చంద్రబాబు కార్యాలయం
విశాఖపట్నం: హుధుద్ తుఫాను తీరం దాటినప్పటి నుంచి, అంటే ఆదివారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విరామం లేకుండా పనిచేస్తున్నారు. నిద్రకు కూడా దూరమై ఆయన తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు సూచనలు ఇస్తున్నారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖలో బస్సునే కార్యాలయంగా మలుచుకుని నిరంతరం పనిచేస్తున్నారు.
విశాఖనగరం తుఫాను తాకిడికి తుక్కుతుక్కుగా మారింది. ఉత్తరాంధ్రలో తుఫాను బీభత్సానికి 20 మంది దాకా మరణించారు. నష్టం ఎంత జరిగిందనేది అంచనా వేయలేమని, అపారమైన నష్టం జరిగిందని చంద్రబాబు ఎన్డీటివితో మాట్లాడుతూ అన్నారు. ఇంటర్వ్యూ కూడా బస్సులోనే ఇచ్చారు.
ఇప్పటికీ విశాఖనగరం 80 శాతానికిపైగా అంధకారంలోనే ఉంది. 20 శాతం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్లు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఫోన్ లైన్లు కూడా పనిచేయడం లేదు. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని, ఇది అత్యవసర పరిస్థితి అని, ఇది సంక్షోభమని తాను టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్లకు, మంత్రులకు అధికారులకు చెబుతున్నట్లు చంద్రబాబు ఎన్డీటివితో చెప్పారు. ఇరవై నాలుగు గంటలూ పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు.
గత రెండు రోజులుగా ఆహారం, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 40 వేల విద్యుత్తు స్తంభాలను నిలబెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. విశాఖపట్నం విమానాశ్రయం పైకప్పు కొట్టుకుపోయింది. మరో వారం వరకు ఇక్కడి నుంచి విమానాలు నడిచే అవకాశం లేదు. విమానాశ్రయానికి 500 కోట్ల మేర, ఉక్కు కర్మాగారానికి వేయి కోట్ల మేర, విశ్వవిద్లాయానికి 400 కోట్లు రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు చంద్రబాబు ఎన్డిటీవితో చెప్పారు.