పవన్లో ఆవేశం! చిరుతోపాటే.. : బాబు, జగన్లపై హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు, ఎంపీ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్మాణ్పై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వారి బలాబలాలపై ఓ వెబ్ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
గతంలో అంతర్జాతీయంగా గుర్తింపు లభించే అభివృద్ధి బాటను నమ్ముకున్న చంద్రబాబునాయుడు.. ఇప్పటికీ అదే మూస పద్ధతిలోనే పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. 2004చంద్రబాబు ఏ కారణంతో ఓడిపోయారో.. 2014లో కాంగ్రెస్ కూడా అదే కారణంతో ఓడిపోయిందని అన్నారు.

చంద్రబాబు మారడం లేదు..
సామాన్య, గ్రామీణ జనాలకు మేలు జరిగితేనే ఓట్లు పడతాయని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చంద్రబాబు మారడం లేదని అన్నారు. అభివృద్ధి నమూనా వల్ల ఓట్లు పడవని అన్నారు. ఎన్టీఆర్ తన హయాంలో రూ2కే కిలో బియ్యం ఇచ్చి ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు. అయితే, ప్రజా సంక్షేమంపై బాబు సరైన విధంగా దృష్టిని సారించలేకపోతున్నారని పేర్కొన్నారు.

అప్పుడు చిరు, పవన్ కలిశారు..
ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంకున్న క్రిస్టియన్లు, దళితులకు తెలుగుదేశం పార్టీ దగ్గరవడం లేదని తెలిపారు. తెలగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో మరెవరూ రాణించే అవకాశం లేదని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి కూడా పార్టీ పెట్టే సందర్భంలో తనను కలిసి సలహా కోరారని, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని చెప్పారు.

పవన్లో ఏదో చేయాలనే ఆవేశం..
తనకు తెలిసి సినిమా నటుల పాత్ర తెలుగు ప్రజల వరకు రాజకీయంగా అంతగా లేదని హరగోపాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా, ఆవేశంగా మాట్లాడతారని అన్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆయనలో ఉండి ఉండవచ్చని చెప్పారు.

జగన్ రాజకీయం వల్నరబుల్
ఇక ఏపీలో ప్రతిపక్ష జగన్ పార్టీ బలహీనంగా ఉందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయం వల్నరబుల్గా ఉందన్నారు. జగన్పై ఉన్న అక్రమ కేసులు జగన్కు ప్రతిబంధకాలని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను కేసులు జగన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని తెలిపారు. ఈ కేసులన్నింటి నుంచి బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిన ఉపయోగించుకుంటున్నాయని హరగోపాల్ అన్నారు.

పవన్కు అవకాశం
ఒకవేల దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డిపై ఏదైనా చర్య తీసుకుంటూ ఏపీలో ప్రత్యామ్నాయం లేకుండా పోయే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఉందని భావిస్తున్నారేమోనని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications