చంద్రబాబుకు హరిబాబు ట్విస్ట్: తామిచ్చే నిధులతోనే అని వ్యాఖ్య
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తామిచ్చే నిధులతోనే పనిచేస్తోందని ఆయన చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో 18 నెలల్లో ఏ రాష్ర్టానికీ ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఎపికి ఇచ్చిందని ఆయన చెప్పారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక అభివృద్ధి పనులకు సహకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయిస్తోందని ఆయన అన్నారు. మార్చి 6న రాజమహేంద్రవరంలో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సభను విజయంతం చేయడం కోసం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది.
ఆ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను కేంద్రం ఎంత వరకు నెరవేర్చిందో ఆయన వివరించారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని, పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా వాటిని మంజూరు చేయాలని ఆయన చెప్పారు. వచ్చేవిద్యాసంవత్సరం నుంచి ఇవి కూడా నడుస్తాయని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఎన్ఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటివి నెలకొల్పామని చెప్పారు. హామీ ఇవ్వకపోయినా హిందూపురంలో సెంట్రల్ ఎక్జైజ్ అండ్ కస్టమ్ ఆఫీసును ఏర్పాటు చేశామని అన్నారు. రూ.160 కోట్లతో ఆలిండియా ఇనస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను నెలకొల్పామని అన్నారు.
కేంద్రమంత్రి నితిన్గడ్కరీ ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ.65వేల కోట్లు మంజూరు చేశారని, కాకినాడ- పాండిచ్చేరి జలరవాణా నంబర్-4ను అభివృద్ధి చేస్తామని హరిబాబు చెప్పారు. రాష్ర్టానికి కేంద్రం లక్షా 90వేల ఇళ్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు రాజధానిలో మౌలిక వసతుల కల్పన. అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణానికి సాయం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇప్పటికే రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న విశాఖలో కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ సమీర అనే సొసైటీలో ఎలకో్ట్ర మాగ్నెటిక్ ఎంటర్ర్పెన్యూ అండ్ కంపార్టబిలిటీ రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రూ.44 కోట్లతో ఐటీ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్మాణానికి వుడాతో ఒప్పందం జరిగిందని చెప్పారు. ఇంకా ఏం చేయబోతున్నామో మార్చి 6న రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా వెల్లడిస్తారని చెప్పారు.
ప్రత్యేక హోదా హామీ ఏమైందని ప్రశ్నించగా.. ప్రత్యేక హొదా ఇవ్వాలో, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలో అధ్యయనం చేసే బాధ్యతను ప్రధాని మోడీ నీతి ఆయోగ్కు అప్పగించారని హరిబాబు బదులిచ్చారు. అన్నీ మీరే చేసినట్టయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయనట్టేనా ప్రశ్నించగా.. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పని చేయిస్తున్నామని స్పష్టం చేశారు.