ఇంతకీ చంద్రబాబు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా...? మంత్రి కన్నబాబు సూటి ప్రశ్న...
దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరా కేంద్రం చేతుల్లో ఉంటుందని తెలిసి కూడా టీడీపీ తమపై విమర్శలు చేస్తోందన్నారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సప్లై పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లకు ఏ కంపెనీ ముందుకు రావట్లేదన్నారు. అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా అని గుర్తుచేశారు.
ఒకవేళ చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు..? ఏపీలోనా...లేక తెలంగాణలోనా...? భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ వేయించుకున్నారా..? లేక కోవీషీల్డ్ వేయించుకున్నారా..? అని వరుస ప్రశ్నలు సంధించారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా...? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల్లో పథకాలు అమలవుతాయా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులు, మనకు రావాల్సిన పన్నులు చూసుకునే రాష్ట్ర బడ్జెట్కు రూపకల్పన చేస్తారని అన్నారు.
Recommended Video
సీఎం జగన్ కడుతున్నది ఇల్లు కాదు.. ఊళ్లు అని కన్నబాబు పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా..? ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా..? అని ప్రశ్నించారు. చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని కోర్టుకు చెప్పింది టీడీపీ కాదా అని నిలదీశారు. సంక్షేమ,అభివృద్ది పథకాలతో సీఎం జగన్ ప్రజలకు దగ్గరవుతుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.