ల్యాండ్ పూలింగ్: పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వ్యాఖ్యల చిచ్చు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జునసేన పార్టీ సెగ తగులుతోంది. ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా జనసేన జెండాలతో రైతులు కొంత మంది ఆందోళనకు దిగడం చంద్రబాబుకు మింగుడు పడే విషయంగా కనిపించడం లేదు. నిజంగానే, వారు జనసేన మద్దతుదారులా, కాదా అనేది తెలియదు. తన పార్టీ జెండాలను వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారా లేదా అనేది కూడా తెలియదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబుకు ఆ సెగ తాకింది.
బేతపూడి గ్రామ రైతులు మాత్రం ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఆందోళనకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం వల్లనే ఆయన చెప్పిన పార్టీకి ఓటేశామని అంటున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని, అందువల్ల తమకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని వారంటున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ రైతులకు తన పార్టీ జెండాలను వాడుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పడానికి ఏ విధమైన ఆధారం కూడా లేదు. కానీ, ఇటీవల ఆయన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు వారికి ఆ జెండాను వాడుకోవడానికి బలాన్ని ఇచ్చాయని మాత్రం భావించవచ్చు. ఎపికి ఇచ్చిన హామీలను ఆమలు చేయాల్సిన సమయం వచ్చిందని అటు బిజెపిని, ఇటు తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో రైతుల గురించి కూడా ఆయన కొన్ని మాటలు ట్వీట్ చేశారు. అది రాజధాని ప్రాంతంలోని రైతులకు నైతిక స్థయిర్యాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు. "కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం పైన వుంది. రైతు కన్నీరు పెట్టకుండ చూడాల్సిన బాధ్యత వుంది లేదంటె వారి ఆగ్రహానికి గురి కావలిసి వస్థుంది. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమి ని గెలిపించారు, వారి చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆ మాటలతో పవన్ కళ్యాణ్ అండదండలు బహుశా తమకు ఉంటాయని రైతులు భావిస్తూ ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ తమకు అన్యాయం జరగకుండా చూస్తారనే విశ్వాసం కూడా వారికి ఉండి ఉండవచ్చు. ఏమైనా, ల్యాండ్ పూలింగ్ వివాదం మరింతగా రాజుకుంటోంది.












Click it and Unblock the Notifications