తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..?
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో నేడు ( ఆగస్టు 25, 2025 ) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజులు పాటు ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలానే తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
కాగా ఈ అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలోని తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. అలానే భారీవర్షాల నేపధ్యంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతల్లోని వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని కోరారు. విద్యుత్ స్తంభాలు, నీటిలో మునిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు.

ఏపీలో వర్షాలు ఎక్కడెక్కడంటే..?
సోమవారం (25-08-25) : శ్రీకాకుళం, విజయనగరం, మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం (26-08-25): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో వర్షాలు ఎక్కడెక్కడంటే..?
తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications