హైదరాబాద్లో కుండపోత: నాలాలో పడి యువతి మృతి
హైదరాబాద్: భారీ వర్షానికి సికింద్రాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. మృతురాలిని షామీర్పేట నివాసిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదుల్లా ప్రవహంచాయి. పంజగుట్ట, అమీర్పేట్ మైత్రీవనం, బేగంపటే, సోమాజిగుడా, కూకట్పల్లి ప్రాంతాల్లో వర్షం నీటికి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సింగడం అనే బస్తీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు చోట్ల ఇళ్ల గోడలు కూలిపోయినట్లు సమాచారం అందింది. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్లో ఎన్నో ప్రాంతాలు జలమయ్యాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్నో చోట్ల మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోయాయి. మహిళ మృతికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ బాధ్యత వహించాలని టిడిపి నేత సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హైదరాబాద్ కమిషన్ సోమేష్ కుమార్ హామీ ఇచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో నాలాలో పడి ఒక మహిళ మృతి చెందగా, నిజామాబాద్లో పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో పిడుగుపాటుకు పది మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటలలో వర్షాలు ఇలాగే కురుస్తాయని వాతావరణ నిపుణులు వివరించారు.