ఏపీలో భారీ వర్షాలు: కొట్టుకుపోయిన రైలు పట్టాలు, ఇళ్లపైకి జనం
అమరావతి: బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కాగా, గుంటూరు జిల్లా గురజాల మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది.
గురజాల గేట్హల్ట్ సమీపంలోని దండివాగు ప్రవాహానికి ట్రాక్పై వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు చోట్ల దెబ్బతింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలును నిలిపి వేశారు. ఈ ట్రాక్ గుండా వెళ్లే రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. నడికుడి-పిడుగురాళ్ల మధ్య రైల్వే ట్రాక్ పై కూడా నీళ్లు చేరాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్నగర్ కాలనీ పూర్తిగా, జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా, గురజాల బస్టాండ్ నీటమునిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పిడుగురాళ్లలో బ్రిడ్జి కింద ఓ భారీ ట్రక్కు పడిపోయింది. దీంతో నీళ్లు బ్రిడ్జి కింది నుంచి వెళ్లడానికి అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చీరాల, అద్దంకిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, జిల్లా వ్యాప్తంగా సగటున 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంగోలులో 15, సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురిచేడులో 9.4, ముండ్లమూరు, మద్దిపాడులో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.