అల్పపీడనం: భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
కర్నూలు, అక్టోబర్ 23 : బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల వాగులు వంకలూ పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో మేహాద్రి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రెండు గేట్లను ఎత్తేశారు. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుండ్లవాగు, సుద్దవాగులు పొంగిపొర్లుతున్నాయి. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కుందూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జనజీవనం స్తంభించి, ఆళ్లగడ్డ-ఇంజేడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం వత్తలూరులో విషాదం నెలకొంది. జిల్లాలో కురుస్తున్న వర్షానికి ఓ ఇళ్లు కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న గర్భిణి మృతి చెందింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటేశ్వరకాలనీ, బలరాంకాలనీ, భాగ్యనగర్ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గుండ్లకమ్మ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం ఆరు గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు. ఒంగోలు, చీరాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఒంగోలులో 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు. నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరులోని పగిలేరు ప్రవాహంలో ఓ మహిళ గల్లంతైంది. విజయనగరంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రావాడ వద్ద కల్వర్టు కూలిపోయింది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల మోకాలు లోతు నీరు చేరింది. సికింద్రాబాద్లోని రేతిబౌలి బస్టాండులోకి నీరు వచ్చి చేరింది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.