కళ్లముందే అలా పోతుంటే బాధేస్తోంది: చంద్రబాబు, ఉప్పొంగిన ఎర్రకాల్వ
అమరావతి: కళ్లముందు లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుంటే బాధ వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమలో కరువు ఉంటే కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడారు.
జల సంరక్షణ చర్యలతో 410 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేయగలిగామని చెప్పారు. రిజర్వాయర్లలో ఇంకా 415 టీఎంసీలకు అవకాశం ఉందని చెప్పారు. అవుకు టన్నెల్ పూర్తయితే మరో 16వేల క్యూసెక్కుల నీటిని తరలించేవారమని, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నుంచీ వీలైనంత అధికంగా నీటిని తరలించాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది
ఏపీ, తెలంగాణలలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పనులు వైపు గోదావరి వరద నీరు దూసుకు వస్తోంది. త్రివేణి క్యాంపు కార్యాలయం నీట మునిగింది. స్పిల్ వే పనులకు ఆటంకం కలగకుండా కార్మికులు గట్టు వేస్తున్నారు. గోదావరి ఉధృతి మరింత పెరిగితే వరద నీరు పోలవరం ప్రాజెక్టు పనుల దగ్గరకు చేరనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. చోడవరం నీట మునిగింది.

విడిపోయాక 511 అవార్డులు వచ్చాయి
చంద్రబాబు అంతకుముందు కలెక్టర్లు, ఇతర అధికారులతో వివిధ శాఖల పురోగతిపై, కేంద్రం సాయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం మనం అద్భుతమైన సమయంలో ఉన్నామని, అనుకున్నవి అన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న పనులన్నీ పూర్తయ్యే మంచి తరుణం ఇదేనని చెప్పారు. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 511 అవార్డులు వచ్చాయన్నారు.

తిరుపతి దేశంలోనే రెండో సురక్షిత స్థానంగా
సగటున 10.5 శాతం వృద్ధి ఏపీలో నమోదయిందని చంద్రబాబు చెప్పారు. సురక్షితమైన నగరాల్లో తిరుపతి దేశంలోనే రెండో స్థానంను కైవసం చేసుకుందన్నారు. విజయవాడ, తిరుపతి నగరాలు మెరుగైన జీవనం సాగించేందుకు వీలున్ననగరాలుగా నిలిచాయని తెలిపారు.

టార్గెట్లు చేరుకోవాలి
డిసెంబర్ నెలలోగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రణాళికలను తయారు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు గ్రామదర్శిని ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలన్నారు. గ్రామాలు, మండలాల వారీగా విజన్ డాక్యుమెంట్లను తయారు చేసి తనకు సమర్పించాలని, వాటిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లే భవిష్యత్ ప్రణాళికను తయారు చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోగా టార్గెట్లను చేరుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications