ఏపీకి పొంచివున్న తుఫాన్ ముప్పు: అక్కడ అతి భారీ వర్షాలు
అమరావతి: ఈ నెల 7వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం సహా పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి, వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

తీవ్ర వాయుగుండంగా..
తీవ్ర అల్పపీడనంగా మారిన అనంతరం పశ్చిమ-మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాలు-ఏపీ ఉత్తరాంధ్ర వరకు విస్తరించింది. వచ్చే 18 గంటల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రత్యేకించి- ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటుదని అన్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

ఛత్తీస్గఢ్ వరకు విస్తరణ..
ఈ నెల 12వ తేదీ వరకు మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంపైకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి కొనసాగుతోన్న ఈ అల్పపీడనం ఈ సాయంత్రానికి వాయుగుండంగా బలపడి మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని వివరించారు. బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ, మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

పలు ప్రాంతాల్లో..
ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విశాఖపట్నం అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సిటీ, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాజమండ్రి, యానాంలల్లో వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నమోదైంది. అక్కడ 60 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.

రాయలసీమలో..
పలాస-47, కోటబొమ్మాళి-35, టెక్కలి-31, సంతబొమ్మాళి-26, సోంపేట-23, మందస-22, కవటి-15 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్, జ్ఞానపురం, సీతమ్మధార, ఇసుకతోట, రైల్వే న్యూ కాలనీ, గోపాలపట్నం, అరిలోవ, పెందుర్తిల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాయలసీమలోని నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలో..
తెలంగాణలోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణల్లో శనివారం వరకూ వర్షాల తీవ్రత కొనసాగుతుందని అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.












Click it and Unblock the Notifications