రాజధాని లక్ష్యం చేరింది: రైతుల హుషారా, భయమా?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ ప్రక్రియకు శనివారం రైతుల నుండి అనూహ్య స్పందన లభించింది. అంగీకర పత్రాలు ఇచ్చేందుకు రైతులు క్యూ కట్టారు. భూసమీకరణకు ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీని డెడ్ లైన్గా ప్రకటించింది. చివరి రోజు రైతుల నుండి విశేష స్పందన రావడంతో రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూలక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంది.
గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని పలు గ్రామాల్లో భూసమీకరణ కార్యాలయాలు రైతులతో కిటకిటలాడాయి. జరీబు భూముల గ్రామాల్లో రద్దీ మరీ ఎక్కువైంది. దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాత్రి పది గంటల వరకు.. శనివారం ఒక్కరోజే నాలుగువేల ఎకరాలకు పైగా భూసమీకరణ జరిగింది. దీంతో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం లక్ష్యమైన 30 వేల ఎకరాలు దాటింది. ఇది మరింత పెరగవచ్చు.
మరోవైపు, రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ ద్వారా వీలుకాని పక్షంలో భూసేకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు భయంతో భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో వేలాదిమంది రైతులు భూములిచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ జరీబు ప్రాంత రైతులు ఆఖరి నిమిషం వరకు వేచిచూసే ధోరణి అనుసరించారు.

పరిహారం పెంపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన తర్వాత అదనపు ప్యాకేజీ ప్రకటించడంతో కొందరు రైతులు ముందుకొచ్చినప్పటికీ మిగిలిన వారు భూములిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అయితే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రులు పదేపదే భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
అందువల్లే తొలి నుంచి భూసమీకరణను వ్యతిరేకిస్తున్న తాడేపల్లి మండలంలోని పెనుమాక రైతులు కూడా శనివారం భూములిచ్చేందుకు ముందుకొచ్చారంటున్నారు. అలాగే తుళ్లూరు మండలంలోని రాయపూడి, మందడం, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, తదితర గ్రామాల రైతులు భూములిచ్చి అంగీకారపత్రాలు పొందారు. వెంకటపాలెం, మందడం, నిడమర్రు, యర్రబాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో ఉదయం నుండే కార్యాలయాలు కిటకిటలాడాయి.
రాయపూడిలో భూములివ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో అబ్బరాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకున్నారు.
భూములిచ్చే వారిని అడ్డుకునేది లేదని, అయితే బలవంతంగా భూములు లాక్కుంటే మాత్రం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఉండవల్లి గ్రామ రైతులు కూడా భూములిచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ గ్రామాల్లోనే అంగీకారపత్రాలు రావాల్సిన భూమి ఎక్కువగా మిగిలి ఉంది.
మరోవైపు, రైతులు వస్తే ఆదివారం కూడా అంగీకర పత్రాలు తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రాజధాని భూసమీకరణ కోసం ఎంపిక చేసిన మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ప్రభుత్వ, ప్రయివేటు, అటవీ, అసైన్డ్, దేవాదాయ భూములు, గ్రామకంఠాలు మొత్తం దాదాపు 48వేల ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది.












Click it and Unblock the Notifications