లిక్కర్ కేసులో మిథున్ విచారణ వేళ హైకోర్టు కీలక ఆదేశాలు..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ కేసు సంచలనంగా మారుతోంది. వైసీపీ ముఖ్య నేతల విచారణ కు సిట్ సిద్దమైంది. సాయిరెడ్డి ఈ రోజు సిట్ ముందుకు విచారణ రావాల్సి ఉండగా.. చివరి నిమిషం లో మినహాయింపు కోరారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నాలుగో విడత నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వటంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మద్య విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మిథున్ కు నోటీసులు
మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విజయవాడలోని సీపీ కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతుకు ముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాలు
లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని ఏపీ సిట్ నోటీసులు జారీ చేయగా... ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల సమక్షంలో మద్యం కేసుపై సిట్ విచారణ చేయాలని, విచారణను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ మిథున్రెడ్డి పిటిషన్లో కోరారు. విచారణను రికార్డు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.
ఇద్దరినీ కలిపి విచారణ
ఇటు విజయ సాయిరెడ్డి - మిథున్ రెడ్డిని కలిపి విచారణ చేయాలని సిట్ భావించింది. ఇద్దరికీ ఒకే రోజు విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. సాయిరెడ్డి ముందుగానే ఈ రోజునే విచారణకు వస్తానని సమాచారం ఇచ్చారు. చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. ఇటు మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డే అంటూ ఇటీవల మీడియా ముందే విజయసాయిరెడ్డి చెప్పిన విషయం సంచలనంగా మారింది. తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సిట్ విచారణలో విజయ సాయిరెడ్డి ఏ విషయాలను బయటపెడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణకు వెళ్తారా.. ఏం జరగనుందనే ఆసక్తి వైసీపీలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications