చంద్రబాబుకు 74 మందితో భద్రత ఇచ్చామంటున్న ప్రభుత్వం.. మావోలు , స్మగ్లర్లతో ప్రాణహాని: టీడీపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పించాల్సిన భద్రతపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన భద్రతను కుదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబుపై రాజకీయ పరమైన పగను తీర్చుకుంటోందని, ఇందులో భాగంగా ఆయనకు కల్పించిన భద్రతను కుదించారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారు. అక్కడితో ఆగలేదు. ఈ అంశంపై వారు హైకోర్టులో పిటీషన్ సైతం దాఖలు చేశారు.
వీడియో: చైనా..దేనికైనా సై! జలమార్గంలో అయిదంతస్తుల భవనం తరలింపు!
ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వాదనలను ఆలకించింది. గురువారం మరోదఫా ఈ పిటీషన్ పై వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీనితో- చంద్రబాబు భద్రతపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగిసినట్టయింది. చంద్రబాబుకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగర్ల నుంచి ప్రాణహాని ఉందని, ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా భద్రతను కుదించిందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇదివరకు చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది తెలిపారు. క్రమంగా ఆ ఇద్దర్నీ తొలగించారని అన్నారు.
ఈ వాదనలను అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు భద్రత కోసం మొత్తం 74 మంది విధులను నిర్వర్తిస్తున్నారని అన్నారు. బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు, ప్రజలను కలుసుకునే సమయంలో చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్జీ) భద్రత కల్పిస్తోందని తెలిపారు. ఎన్ఎస్జీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు నివాసం, కార్యాలయంలో ఉన్నప్పుడు ఆయన భద్రతా బాధ్యతల్లో తాము జోక్యం చేసుకోబోమని అన్నారు. ఇల్లు, కార్యాలయాల్లో చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.