భక్తుల రక్షణ చర్యలపై టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు..!!
Tirumala: భక్తుల రక్షణ చర్యల పైన ఏపీ హైకోర్టు టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చిది. తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ అంశంపై జేఏసీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. భక్తుల రక్షణ అంశంపై వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్, టీటీడీ, అటవీశాఖ అధికారుల జేఏసీ సమర్పించిన నివేదికలో పలు సిఫారసులు చేసిందని గుర్తు చేసింది. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు మరో రూ.15 లక్షల పరిహారం అందజేసే విషయాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించింది.
హైకోర్టు ధర్మాసనం టీటీడీకి కీలక సూచనలు చేసింది. వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు కాలినడక మార్గంలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి 2023లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ వేళ పిటిషనర్ తరఫు న్యాయవాది రేగులగడ్డ వెంకటేశ్ స్పందిస్తూ... నడక మార్గంలో భక్తుల రక్షణపై జేఏసీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కమిటీ నివేదికలోని స్వల్పకాలిక సిఫారసులను అమలు చేశామని టీటీడీ తరఫు న్యాయవాది చెప్పారు. కమిటీ సూచనలు, సిఫారసులను తూచా తప్పకుండా అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అదే విధంగా తిరుమల నడక దారిలో జరిగిన చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో రూ.15 లక్షల పరిహారం అందజేయాలని టిటిడికి హైకోర్టు సూచన చేసింది. ఈ మొత్తం చెల్లించడం వల్ల టిటిడికి నష్టమేమీ ఉండదని అభిప్రాయపడింది. బాధిత కుటుంబంలో మార్పుకు వీలుంటుందని చెప్పింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అటవీశాఖ, టిటిడి అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ నివేదిక ఇచ్చింది. యాత్రికుల రక్షణ గురించి కమిటీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక సిఫార్సులు ఏ మేరకు అమలు చేసిందో తెలుసుకునేందు కు కమిటీ వేస్తామని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నవంబర్లో జాయింట్ యాక్షన్ కమిటీ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కమిటీ వేస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను డిసెంబరు 24కి వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications