ఎంతవారైనా వద్దు, చేతకాకుంటే చెప్పండి: ఏపీ, టీలపై కోర్టు ఆగ్రహం
హైదరాబాద్: అనధికార ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లను తొలగించే వియంలో అధికారుల ఉదాసీనత పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్థలాల్లో వాటి ఏర్పాటను ఏంతమాత్రం అంగీకరించేది లేదని ఉభ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అనధికార ఫ్లెక్సీల తొలగింపుపై ఏం చర్యలు తీసుకున్నారో ఈ నెల 23వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది.
మీవల్ల కాకపోతే చెప్పండి... మేమే చూసుకుంటామని ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. నాయకులా, సెలబ్రెటీలా, క్రీడాకారులా, నటులా ఎవరి ఫొటో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లపై ఉంటే వారి నుంచే జరిమానాలు కట్టిస్తామని చీఫ్ జస్టిస్ కల్యాణ జ్యోతి సేన్గుప్త, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల బెంచ్ స్పష్టం చేసింది.
ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు నుంచి గుడిమిల్లపాడుకు వెళ్లే దారిలో విగ్రహాల ఏర్పాటును నిలిపివేయించాలని కోరుతూ 2008లో ఎస్. మురళీక్రిష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు, శుక్రవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ప్రజా జీవనానికి ఇబ్బందిగా మారుతున్న ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్ల సంస్కృతిపై బెంచ్ తీవ్రంగా మండిపడింది. బ్యానర్లు, ఫ్లెక్సీలపై ఎవరి ఫొటో ఉంటే వారినే బాధ్యులను చేస్తామని, తమ ఫొటోలు పెట్టవద్దని తమ అనుచరులకు, అభిమానులకు విజ్ఞప్తి చేసేలా చేస్తామని పేర్కొన్నారు.
ఈ విషయంలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు చివరి అవకాశం ఇస్తున్నామని, వాటిని తొలగించడంలో విధానం ప్రకటించాలని బెంచ్ ఆదేశించింది. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ను కొనసాగిస్తున్నదని తెలంగాణ ఏజీ కె రామకృష్ణా రెడ్డి వివరించారు. దీనికోసం జీవోలు కూడా తెచ్చినట్టు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికి 50శాతం మేర తొలగించామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. దీనిపై ఉమ్మడి హైకోర్టు పెదవి విరిసింది.