సంక్రాంతి వేళ పందెం రాయుళ్లకు నిరాశ: కోడి పందేలకు హైకోర్టు నో
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్లతో కూడిన కోడి పందాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్ ఈ అంశంపై పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో జంతు సంక్షేమ బోర్డు ఇంప్లీడ్ అవుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది.
2014లో పిటిషనర్ పిల్ను దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం ప్రకటనతో పిటిషన్పై విచారణ ముగిసినట్లు ప్రకటించిందని జంతు సంక్షేమబోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత మరొక పిటిషనర్ ఇదే విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, యథాతథ స్ధితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోడి పందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలా అనుమతించారని హైకోర్టు ప్రశ్నించింది.
ఆ తర్వాత హైకోర్టు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల వివరాలను గురువారం హైకోర్టు బెంచికి సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషనన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోంస్లే, జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ ఎస్వి భట్ విచారించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి లీగల్ సర్వీసెస్ అథారిటి చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఈ పోస్టులో జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే కొనసాగారు.
బోస్లేను ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయింది. దాంతో ఈ ఖాళీని రమేష్ రంగనాథన్తో భర్తీ చేశారు. ఈ మేరకు హోం (కోర్టులు-ఎ) శాఖ కార్యదర్శి టి. నారాయణరెడ్డి పేరుతో మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.