ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మరో తలనొప్పి
టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తుది జాబితా ప్రకటించిన దగ్గర నుంచి కూడా పార్టీలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. టికెట్ దక్కని నేతల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమౌతున్నాయి. టీడీపీ తుది జాబితాలో చోటు దక్కని నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ప్రకటించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు...తమ నాయకుడుగా మద్దతుగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు కూడా ప్రతి నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను అక్కడ నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే దీనిపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని కనీస సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని ఎలా మొదలుపెడతారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలాగే ప్రవర్తిస్తే..వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపుకు తాము సహకరించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ప్రచారం మొదటి రోజే తెలుగు తమ్ముళ్లు ఇలా గొడవకు దిగడంతో పార్టీ పరువు రోడ్డున పడింది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారింది. దీనిపై పార్టీ అధినేత జోక్యం చేసుకుని వీరి మధ్య సయోధ్య కుదిరిస్తే తప్ప ఈ సమస్య సమసిపోయేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications