ఉద్రిక్తంగా విజయవాడ..!. టీడీపీ నేత కారుకు జీపుల్ని అడ్డం పెట్టిన పోలీసులు! బయటకు రాకుండా గేట్లు వేశారు!!
వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దుచేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ''దళిత గర్జన'' ధర్నా ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతోపాటు పార్టీ నేతలు పలువురిని గృహ నిర్బంధంలోకి తీసుకోవడంతో ఆందోళనకారులు ధర్నా చౌక్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు సిద్ధమయ్యారు. ముందు అనుమతిచ్చిన పోలీసులు ఇప్పుడు నిరాకరిస్తున్నారంటూ ట్యాంక్ ఎక్కారు. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమంటూ మండిపడ్డారు. ట్యాంక్ ఎక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గృహ నిర్బంధంలో తెలుగుదేశం పార్టీ నేతలు
''దళిత గర్జన''లో పాల్గొనడానికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచుతోంది. విజయవాడలో పార్టీ నేతల ఇళ్లకు సమీపంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా నిఘా ఏర్పాటు చేశారు. గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా, అశోక్ బాబు, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న, బొండా ఉమ, పట్టాభి తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై వారంతా నిరసన వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోయారు.
నక్కా కారుకు పోలీసు జీపుల్ని అడ్డం పెట్టారు
దళితులకు దక్కాల్సిన నిధులు రావడంలేదని, వారి హక్కులను జగన్ ప్రభుత్వం హరించి వేస్తోందంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలో జరిగే ''దళిత గర్జన''కు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆనంద్ బాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన కారుకు పోలీసులు తమ జీపుల్ని అడ్డంగా పెట్టారు. ఇంట్లో నుంచి రానివ్వకుండా గేట్లు వేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ నక్కా ఆనంద్ బాబు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరు, పోలీసుల ఆంక్షలపై ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో అడుగడుగునా రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ధ్వజమెత్తారు.
ఉదయం నుంచే ఉద్రిక్తంగా విజయవాడ
''దళిత గర్జన'' కు హాజరవకుండా టీడీపీ నేతలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. పట్టాభి ఇంటిచుట్టూ పోలీసులు మొహరించారు. తర్వాత బొండా ఉమామహేశ్వరరావుతోపాటు వరుసగా ఇతర నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎస్సీ నేతలను విజయవాడ రానివ్వకుండా ఆయా జిల్లాల్లో పోలీసులు సోమవారం నుంచే చర్యలు చేపట్టారు.