నిజానికి శ్రీకాకుళం అనుకున్నా.. కానీ ఇక్కడినుంచి మొదలుపెట్టా: పవన్ కల్యాణ్
విశాఖపట్నం: గంగవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఆసాంతం అభిమానుల నినాదాలతో మార్మోగింది. ఆయన అక్కడ అడుగుపెట్టడమే ఆలస్యం.. సీఎం.. సీఎం.. అంటూ గ్రామమంతా హోరెత్తిపోయింది.
ఉదయం 11గం.కే పవన్ వస్తారన్న విషయం తెలుసుకుని.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆయన్ను చూడటం కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సభా ప్రాంగణం ' 'సీఎం.. సీఎం..' నినాదాలతో దద్దరిల్లింది. గ్రామంలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడానికి చాలానే సమయం పట్టింది.

అభిమానుల తాకిడిని తప్పించుకుంటూ సభా వేదిక వద్దకు రావడానికి దాదాపు 30నిమిషాల సమయం పట్టింది. ఎలాగోలా వేదిక వద్దకు వచ్చిన పవన్.. ఆ తర్వాత బాధితుల సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పవన్ వేదికపై నుంచి మాట్లాడుతున్న సమయంలో.. అభిమానులు నినాదాలతో ఆయనకు అడ్డు తగిలారు. దీంతో పవన్ వారిని సున్నితంగా వారించారు.
అరుపులు, కేకలతో సమస్యలు పరిష్కారం కావని, తాను చెప్పేది వినాలని పవన్ కోరడంతో అభిమానులు కాస్త వెనక్కి తగ్గారు. నిజానికి తాను శ్రీకాకుళం నుంచి తన పర్యటన మొదలుపెట్టాలని భావించానని, కానీ గంగవరం పోర్టు కాలుష్యం గురించి తెలియడంతో.. ఇక్కడికి వచ్చానని చెప్పారు.
వేసవిలో ఈ నాలుగు నెలలు గాలుల ఉధృతికి పరిసర ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉందన్నారు. కాలుష్యాన్ని నియంత్రించలేని పక్షంలో పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడినుంచి తరలించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తనను సీఎంగా చూడాలనుకుంటే.. అంతకుముందు తాను సమస్యల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు.
కాగా, పవన్ తో కరచాలనం కోసం కొంతమంది ఎగబడటంతో బౌన్సర్లు వారిని నెట్టేశారు. దీంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications