బాలకృష్ణ ఇలాకా: తెలుగు తమ్ముళ్లా మజాకా, కర్రలతో దాడి
బాలక్రుష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం పరిధిలో తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు.
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రెండుసార్లు, ఆయన తనయుడు హరికృష్ణ ఒకసారి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమిది. 1989 - 94 మధ్య విపక్ష నేతగానూ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం టీడీపీకి పెట్టని కోట. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడైన నందమూరి బాలకృష్ణ ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో అధికార టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. మునిసిపల్ చైర్పర్సన్ భర్తతోపాటు ఇద్దరు కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, వారి అనుచరులు నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ, రౌడీల్లా వ్యవహరిస్తూ ఆందోళనకారులపై ప్లకార్డులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన వారిని తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. గతంలో ఇదే నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి.
Recommended Video


స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఇలా రాస్తారోకో
అధికార టీడీపీ నేతల మధ్య గ్రూపు తగాదాల కారణంగా ఎమ్మెల్యే బాలకృష్ణ తన వ్యక్తిగత కార్యదర్శిని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న వారిపై అధికార టీడీపీ నేతలు దాడిచేసి దాష్టీకానికి పాల్పడుతున్నా పోలీసులు మాత్రం తమకేమీ పట్లనట్లు ప్రేక్షక పాత్ర పోషించడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం మునిసిపాలిటీలో ముద్దిరెడ్డిపల్లి ప్రాంతం కీలకం. ఇక్కడ చేనేత కార్మికులు, వ్యాపారులు అధికం. ఇక్కడి ప్రజలు ఇంటిగుత్తలు, ఇతర పన్నులతో ప్రతి ఏటా రూ.50 లక్షలకు పైగా చెల్లిస్తున్నా సరైన రోడ్లు, అవసరమైన డ్రెయినేజీలు లేవు. మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో ముద్దిరెడ్డిపల్లి కాలనీవాసులు సోమవారం మేళాపురం క్రాస్ వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ఎస్ఐ దిలీప్కుమార్ ప్రయత్నించారు.

చితకబాదిన టీడీపీ నేతలు
తమకు చైర్పర్సన్ రావెళ్ల లక్ష్మి, అధికారులు గట్టి హామీ ఇస్తేగానీ ఆందోళన విరమించేది లేదని ముద్దిరెడ్డిపల్లి కాలనీ వాసులు భీష్మించారు. ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే మేళాపురం ఆటో స్టాండ్ వద్ద 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమానికి చైర్పర్సన్ వచ్చారని, ఆమెతో మాట్లాడిస్తామని వారిని అక్కడి నుంచి పక్కకు పంపి వేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ వస్తున్న ముద్దిరెడ్డిపల్లి వాసులను గమనించిన చైర్పర్సన్ రావెళ్ల లక్ష్మి భర్త టీడీపీ నేత నాగరాజు, ఆ పార్టీ కౌన్సిలర్ నంజప్ప, నింకంపల్లి రామాంజి, తదితర నాయకులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురెళ్లి దుర్భాషలాడారు. అడ్డం వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నాగభూషణంపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. కాలనీవాసులు నారాయణ, తిప్పన్న మరికొందరిపై విరుచుకుపడి దాడి చేశారు. ప్లకార్డు కర్రలతో చితకబాదారు. 'మాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే' అంటూ నాలుక మడతపెట్టి.. వేలు చూపుతూ వీరంగం వేశారు. రౌడీలను తలపించిన వీరి తీరును ముద్దిరెడ్డిపల్లివాసులు చీదరించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇన్చార్జి సీఐ వెంకటేశులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ముద్దిరెడ్డిపల్లివాసులను వెనక్కు పంపేశారు. అధికార పార్టీ టీడీపీ నేతలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది.












Click it and Unblock the Notifications