టీటీడీ మాస్టర్ ప్లాన్
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం నాడు 51,082 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,836 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.86 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
కాగా- పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని సమగ్రాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నడుం బిగించింది. వచ్చే 50 సంవత్సరాల అవసరాలకు సరిపడేలా ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించనుంది. రోజువారీ భక్తుల రాక అంచనా, వాహనాల తాకిడి, పరిసర ప్రాంతాలు.. వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేయనుంది.

ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఆదేశించారు. భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై నివేదిక అందజేయాలని అన్నారు.
మరింత మంది భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలను ఇందులో పొందుపర్చాలని అనిల్ కుమార్ సింఘాల్.. ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం, హనుమంతుడి సేవా నిరతి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా మ్యూజియం, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్ వంటివి ఈ మాస్టర్ ప్లాన్ లో ఉండాలని అన్నారు.
సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ అనిల్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications