అరుదైన పరిస్థితులు, చరిత్రలో నిలిచిపోతారు: టిపై జగన్
హైదరాబాద్: ఈ శీతాకాల సమావేశాలు చారిత్రకమైనవని, అరుదైన పరిస్థితులను చూస్తున్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శాసన సభ్యులకు సూచించారు. ఈ రోజు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. ఇవి చారిత్రక సమావేశాలన్నారు. ఎప్పుడు చూడని అరుదైన పరిస్థితులను చూస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. అలా అయితే అందరూ చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమావేశాలు పూర్తయ్యే వరకు ఎవరు కూడా సభను వదిలి పెట్టి వెళ్లవద్దని సూచించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా అవసరమైతే సీమాంధ్ర ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలని సూచించారు. శాసన సభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమన్నారు. సమైక్య తీర్మానం పైనే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. జగన్తో జరిగిన భేటీలో విశ్వరూప్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శోభా నాగి రెడ్డిలు పాల్గొన్నారు.
శాసన సభలో వాయిదా తీర్మానాలు
శాసన సభలో చర్చించాల్సిన వివిధ అంశాలపై విపక్షాలు సభాపతికి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కోరుతూ టిడిపి, తెలంగాణ బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ తెరాస, బిజెపి, నాగం జనార్ధన్ రెడ్డి, సమైక్యం తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సిపిఎం వాయిదా తీర్మానం అందజేశాయి. కాగా, సభ ప్రారంభమయ్యాక సభాపతి వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.












Click it and Unblock the Notifications