40ఏళ్ల రాజకీయంలో ఇలాంటిది చూడలేదు, చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుంది: వెంకయ్య
తన 40ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఒక రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో ప్రాజెక్టులు కేటాయించడం ఎన్నడూ చూడలేదని వెంకయ్య అన్నారు.
విశాఖపట్నం: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు అందించిన సహాయం విషయంలో చరిత్ర ఎప్పటికీ తనను గుర్తుపెట్టుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తన 40ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఒక రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో ప్రాజెక్టులు కేటాయించడం ఎన్నడూ చూడలేదని వెంకయ్య అన్నారు. సందర్భం, అవకాశం దొరికిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు.
ఈ సందర్బంగా రాష్ట్రానికి కేంద్రం చేసిన పలు సహాయాల గురించి వెంకయ్య వివరించారు. ఆంధ్రప్రదేశ్కు 950 మెడికల్ సీట్లు కేంద్రం అదనంగా ఇచ్చిందని, రాష్ట్రానికి 2500మెగావాట్ల సామర్థ్యం గల రెండు సోలార్ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రూ.3వేలకు కోట్లకు పైగా నిధులిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 1.93లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు.