సుచరిత నోట రఘురామ భవిష్యవాణి..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పూర్తిస్థాయిలో పార్టీ లైన్ లోకి వచ్చేసినట్టే కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పదవిని కోల్పోయినప్పటి నుంచీ పెద్దగా వార్తల్లోనూ లేరు. పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల అలకబూనారని, పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఇదివరకు ప్రచారం జరిగింది.

కొత్త అభ్యర్థి ప్రయత్నాల్లో..
ప్రస్తుతం ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని వెదుక్కునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఉందనే అభిప్రాయాలు గతంలో వ్యక్తం అయ్యాయి. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ స్థానంలో అభ్యర్థులను నిలబెట్టడానికి కొందరు యువ నాయకుల పేర్లను పరిశీలిస్తోందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగింది.

అలక వీడినట్టే..
ఈ పరిస్థితుల మధ్య మేకతోటి సుచరిత మళ్లీ పార్టీ ట్రాక్ లో పడ్డారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరం ఫులేగా అభివర్ణిస్తూ బర్త్డే విషెష్ తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను పార్టీలోనే కొనసాగుతున్నాననే సంకేతాన్ని పంపించినట్టయింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనతో జగన్ పాలనను పోల్చారు. 16 మెడికల్ కాలేజీలను నిర్మిస్తూ విద్యారంగంలోనే చరిత్ర సృష్టిస్తున్నారంటూ జగన్ ను ప్రశంసించారు.

విధేయత చాటుకున్న సుచరిత..
ఇప్పుడు తాజాగా మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పార్టీపై తన విధేయతను సుచరిత మరోసారి చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై నిప్పులు చెరిగారు. ఆయన వైఖరిని తప్పుపట్టారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీపై రఘురామ చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. రానురాను ప్రజలు అసహ్యించుకునేలా వ్యవహరిస్తోన్నారంటూ ఎదురుదాడికి దిగారు.

గర్వించే నాయకుడు..
ఈ రాష్ట్రంలో ప్రజలు గర్వించే నాయకుడెవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్ ఒక్కరేనని సుచరిత అన్నారు. ఈ క్రమంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను ప్రస్తావించారు. ప్రజలు ఏ మాత్రం విశ్వసించని నాయకుడంటే చంద్రబాబేనని, ప్రజలు స్వాగతించని నాయకుడంటే అది పవన్ కళ్యాణే అనే విమర్శించారు. ప్రజలు అస్యహించుకనే రాజకీయ నాయకుడంటే అది రఘరామరాజు అంటూ ట్వీట్ చేశారు.

భవిష్యవాణి వినిపిస్తోంది..
హోం శాఖ మంత్రి తానేటి వనిత కూడా రఘురామ కృష్ణంరాజుపై విమర్శలు సంధించారు. రఘురామ కృష్ణంరాజు శృతి మించి మాట్లాడుతున్నారని, అందులో ఆయన భవిష్యవాణి వినిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రఘురామ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అంతే దిగజారిపోతోందని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనకు తప్ప ప్రజలందరికీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications