సైన్యం నుంచి సామాన్యుల దాకా...విశాఖలో జలవిహారం కోసం...హోవర్ క్రాఫ్టులు
విశాఖపట్టణం: ఇప్పటివరకు సైన్యానికి మాత్రమే అందుబాటులో ఉన్న అత్యాధునిక ఉభయచర వాహనాలు హోవార్డ్ క్రాఫ్ట్ లు, ఇప్పుడు విశాఖలో సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. జల క్రీడలను ప్రోత్సహించేందుకు...పర్యాటక రంగాన్నిమరింత అభివృద్ది చేసేందుకు ఈ ఖరీదైన ఉభయచర వాహనాలను ఎపి ప్రభుత్వం తెప్పిస్తోంది.
నీటి మీదే కాదు నేలమీద కూడా దూసుకుపోయే ప్రత్యేక వాహనం హోవర్ క్రాఫ్ట్లు ఇప్పటివరకూ మన దేశంలో తీర రక్షణ దళంలో మాత్రమే ఉన్నాయి. ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా తదితర దేశాల్లో ఈ హోవర్ క్రాఫ్ట్లు పర్యాటకులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అయితే దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు సైతం ఈ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాల కోసం రష్యాకు ఆర్డర్ ఇవ్వగా అవి అక్కడ నుంచి సరుకు రవాణా షిప్ లో విశాఖకు బయలుదేరినట్లు తెలిసింది.

రష్యా నుంచి...హోవర్ క్రాఫ్టులు...
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఒక వైపు విశాఖలో జల క్రీడల అభివృద్ది కోసం...మరోవైపు ఎపి టూరిజాన్ని మరింత డెవలప్ చేసే లక్ష్యంతో ఈ రష్యా నుంచి హోవార్డ్ క్రాఫ్ట్ లను విశాఖ రప్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 9 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆరు సీట్ల వాహనాలు మూడు, తొమ్మిది సీట్ల వాహనం ఒకటి గత నెల 9న నౌకలో రష్యా నుంచి బయలుదేరాయి. ఇవి జనవరి 15 నాటికి విశాఖ చేరుకుంటాయి. ఆరు సీట్ల హోవర్ క్రాఫ్ట్ వాహనం కొనుగోలుకు రూ. 1.2 కోట్ల చొప్పున, తొమ్మిది సీట్ల వాహనానికి రూ. 2 కోట్ల చొప్పున వెచ్చిస్తున్నారు. దీనికి అదనంగా అంతర్జాతీయ వస్తు సేవా పన్ను...ఐజిఎస్టి 64.7 శాతం పడుతోంది.

ఎక్కడైనా...ఎలాగైనా...నడుస్తాయి...
హోవర్ క్రాఫ్ట్ వాహనాలు కింది భాగం గాలి బుడగలు గొలుసుకట్టు మాదిరిగా పేర్చినట్లు ఉంటుంది. ఇవి ఎలాంటి ప్రాంతంలోనైనా సునాయాసంగా వెళ్లగలుగుతాయి. కేవలం జలక్రీడల కోసమే కాకుండా విపత్తుల సమయం లోనూ వీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోకి సైతం ఈ వాహనాలతో సులభంగా వెళ్లొచ్చు. విశాఖ సాగరతీరం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అభివద్ధి చెందుతున్నందున కోస్టల్ పెట్రోలింగుకూ వీటిని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంమీద పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే తీరులో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హోవార్డ్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం అతితక్కువ.

అనుమతులు...విస్తరణ
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు అవసరమైన నౌకాదళ, కోస్ట్గార్డు, పోర్టు ట్రస్ట్ సిఆర్జెడ్ కు సంబంధించి పర్మిట్లన్నీ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కలెక్టర్ ప్రవీణ్కుమార్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులతో సమావేశమై అనుమతుల కోసం రాష్ట్ర సిఆర్జెడ్కు నివేదిక పంపారు. గుత్తేదారు సంస్థ సిఎం కార్యాలయంలో ఈ ప్రాజెక్టు తీరు తెన్నులను ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరింది. ఇతర రాష్ట్రాల్లోని అనుబంధ రంగాల అధికారులను ప్రారంభోత్సవ, ట్రయల్ రన్ కార్యక్రమానికి అనుమతించేలా ఏర్పాట్ల చేయాలని సంస్థ ఎమ్డి ఆర్ఎం చైతన్యవర్మ ప్రభుత్వాన్ని కోరారు. వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి ప్రాజెక్టు విస్తరణపై ఒక అంచనాకు రానున్నారు.

ఏ సంస్థ...ఎలా...ఎప్పటికల్లా...
హోవర్ క్రాఫ్ట్లు దేశంలోనే తొలిసారిగా విశాఖ సాగర తీరంలో సందడి చేయనున్నాయి. విశాఖకు చెందిన అక్షయ ఎంటర్ ప్రైజస్ సంస్థ 'హోవర్ డాక్ లిమిటెడ్ లయబులిటీ పార్టనర్షిప్ పేరుతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందిన హోవర్ డాక్ ఎల్ఎల్పి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఫిబ్రవరిలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ సహకారంతో ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రూపొందిసున్నారు. విశాఖ అందాలను చూసేందుకు తరలివచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నందున ఈ ప్రాజెక్టుకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications